మృగాడికి కఠిన శిక్ష, అజన్మాంతం జైలులోనే, స్పెషల్ కోర్టు సంచలన తీర్పు, 2 లక్షల జరిమానా..
వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి మర్డర్ మిస్టరీ వీడిన కొద్దిసేపటికే నెల్లూరు ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. మైనర్ బాలికను లైంగికదాడి చేసిన యువకుడికి అజన్మాంతం జైలు శిక్ష విధించింది. ప్రత్యేక కోర్టు తీర్పుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. నాలుగేళ్లకు తమను న్యాయం జరిగిందని బాలిక పేరెంట్స్, స్థానికులు పేర్కొంటున్నారు. కోర్టు తీర్పును ప్రజాసంఘాలు కూడా స్వాగతించాయి.
ఏం జరిగిందంటే..
2015లో నెల్లూరు జిల్లా ముత్తుకూరులో తన అమ్మమ్మ ఇంటికి బాలిక వచ్చింది. ఆమె అనారోగ్యంగా ఉండటంతో చేదోడు వాదోడుగా ఉండేందుకు అమ్మమ్మ వద్ద ఉంచారు. ఆ సమయంలోనే సాయికృష్ణ అనే మృగాడు బాలికను మభ్యపెట్టాడు. ఏదో కొనిస్తానని తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ విషయాన్ని బాలిక వెంటనే తన అమ్మమ్మ, తల్లిదండ్రులకు తెలిపింది. వారు పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు.
విచారణ ఇలా..
అప్పటి డీఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి ప్రత్యేక కోర్టుకు సాక్ష్యాధారాలను సమర్పించారు. కేసులో వాదనలు ఇటీవలే ముగిశాయి. శుక్రవారం న్యాయమూర్తి రమేశ్ కుమార్ తీర్పును వెలువరించారు. నిందితుడి సాయికృష్ణ బతికి ఉన్నాళ్లు జైలులో ఉండాలని న్యాయమూర్తి రమేశ్ కుమార్ తీర్పిచ్చారు. దాంతోపాటు రూ.2 లక్షల జరిమానా కూడా వేశారు.
అజన్మాంతం శిక్ష..
మైనర్ బాలికపై అత్యాచారాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించారు. అజన్మాంతం శిక్ష కన్నా ఎక్కువ విధించిన తప్పులేదని కోర్టు అభిప్రాయపడింది. కోర్టు తీర్పును బాలిక పేరెంట్స్ స్వాగతించారు. తమకు న్యాయం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు. ఇటు ప్రజాసంఘాలు, మేధావులు కూడా కోర్టు తీర్పును స్వాగతించారు. మృగాడికి సరైన శిక్ష విధించారని అభిప్రాయపడ్డారు.
ఒకేరోజు
ప్రియాంకరెడ్డి నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టిన రోజే కోర్టు మరో మృగాడికి శిక్ష విధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రియాంక నిందితులకు మాత్రం ఉరే సరి అని యావత్ జాతి అభిప్రాయపడుతుంది. ప్రియాంక తండ్రి శ్రీధర్ రెడ్డి మాత్రం లాయర్లు ఎవరూ నిందితుల తరఫున వాదించొద్దని విన్నవించారు.