ఇటలీ నుంచి నెల్లూరుకు: భయానక వైరస్ లక్షణాలతో.. ఐసొలేషన్ వార్డులో విద్యార్థి: కుటుంబంతో సహా..!
నెల్లూరు: ప్రపంచాన్ని వణికిస్తున్న భయానక కరోనా వైరస్ జాడలు ఏపీలోనూ కనిపిస్తున్నాయి. ఇటలీ నుంచి వచ్చిన ఓ విద్యార్థికి కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. వైరస్ సోకిందనే అనుమానాలతో ముందు జాగ్రత్త చర్యగా ఆయనను ఐసొలేషన్ వార్డులో చేర్చారు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు. అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. రక్త నమూనాలను తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఙాన సంస్థ (స్విమ్స్)కు పంపించారు.
నెల్లూరులోని చిన్నబజారుకు చెందిన ఆ విద్యార్థి కొంతకాలంగా ఇటలీలో నివసిస్తున్నారు. ఉన్నత చదువుల కోసం ఆయన ఇటలీకి వెళ్లారు. ప్రస్తుతం కరోనా వైరస్ ఇటలీని చుట్టుముట్టిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ బారినపడి ఇటలీలో ఇప్పటికే 100 మంది మరణించారు. అలాంటి పరిస్థితుల్లో ఆ విద్యార్థి స్వస్థలానికి తిరిగి వచ్చారు. ఇటలీ నుంచి చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న ఆయనను అక్కడి సిబ్బంది థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించారు. ఆ సమయంలో ఎలాంటి లక్షణాలు కూడా బయటపడలేదు. దీనితో ఆయన ఇంటికి చేరుకున్నారు.
రెండురోజులుగా ఆ విద్యార్థి జ్వరం, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతుండటంతో ఆయనను కుటుంబీకులు ఆసుపత్రికి తరలించారు. కరోనా వ్యాధి లక్షణాలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో ఉంచిన వైద్యులు చికిత్సను ప్రారంభించారు. రక్త నమూనాలను స్విమ్స్ ఆసుపత్రికి పంపించారు. అక్కడి నుంచి నివేదిక ఇంకా అందాల్సి ఉంది. ఆయనతో పాటు కుటుంబ సభ్యులకు కూడా వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారు డాక్టర్లు.
వైసీపీలో మరో మాజీ మంత్రి: జనసేనలో ఇమడలేక..: విశాఖపై పట్టు సాధించినట్టే..!
ఈ ఘటన కాస్తా నెల్లూరు జిల్లాలో కలకలానికి దారి తీసింది. కరోనా వైరస్ బారిన పడి చైనా తరువాత అత్యధికంగా మరణాలను నమోదైన ఇటలీ నుంచి ఆయన రావడం.. వచ్చిన రెండు, మూడు రోజుల వ్యవధిలోనే ప్రాణాంతక వైరస్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరడం పట్ల ఆందోళన వ్యక్తమౌతోంది. దీనిపై జిల్లా కలెక్టర్.. పూర్తి వివరాలను తెప్పించుకున్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సంప్రదింపులు నిర్వహిస్తున్నారు.