టీడీపీ ఎమ్మెల్సీకి కరోనా వైరస్ పాజిటివ్: హోమ్ క్వారంటైన్లో: హెల్త్ ఎలా ఉందంటే?
నెల్లూరు: ఏపీలో కరోనా వైరస్ బారిన పడుతోన్న రాజకీయ నేతల జాబితాలో మరొకరు చేరారు. తాజాగా నెల్లూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, శాసన మండలి సభ్యుడు బీద రవిచంద్ర కరోనా వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన హోమ్ క్వారంటైన్లో ఉంటున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. తనకు కరోనా వైరస్ సోకిందనే సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ట్విట్టర్, ఫేస్బుక్ అకౌంట్లలో దీనికి సంబంధించిన వివరాలను పొందుపరిచారు.
రెండు రోజులుగా ఆయన అనారోగ్యంతో ఉంటున్నారు. శనివారం ఆయన కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. వెంటనే ఆయన హోమ్ క్వారంటైన్లోకి వెళ్లారు. చికిత్స తీసుకుంటున్నారు. తన ఆరోగ్యం బాగుందని, డాక్టర్ల సలహా మేరకు క్వారంటైన్లో ఉంటున్నానని వివరించారు. చెప్పారు. పార్టీ తోటి నాయకులు, కార్యకర్తలు, అనుచరులు తన ఆరోగ్యం పట్ల ఆందోళన చెందవద్దని సూచించారు. త్వరలోనే తాను సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని, మళ్లీ ప్రజా సమస్యలను పరిష్కరించడంపై దృష్టి సారిస్తానని భరోసా ఇచ్చారు.
ఇటీవలి కాలంలో తనను కలిసిన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, అనుచరులు వెంటనే కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను చేయించుకోవాలని సూచించారు. అనారోగ్యానికి గురైతే.. వెంటనే కరోనా టెస్టింగుల కోసం శాంపిళ్లను అందజేయాలని అన్నారు. బీద రవిచంద్ర యాదవ్.. కొంతకాలంగా జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. జిల్లా స్థాయి పార్టీ సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కరోనా వైరస్ సోకి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
కాగా- రాష్ట్ర వైద్య శాఖాధికారులు శనివారం విడుదల చేసిన రోజువారీ బులెటిన్ ప్రకారం.. నెల్లూరు జిల్లాలో కొత్తగా 11 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటిదాకా ఈ జిల్లాలో 62, 215 కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 61,258 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 506 మంది ఈ మహమ్మారి బారిన పడి మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా అత్యల్పంగా 199 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.