కరోనాకే కాదు.. వాళ్లకూ కనికరం లేదు.. అరటిపండ్లు అమ్ముకుంటున్న టీచర్..
కరోనా లాక్ డౌన్ కారణంగా ఎంతోమంది ఉపాధి కోల్పోయి తిప్పలు పడుతున్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కూడా ఈ తిప్పలు తప్పట్లేదు. అడ్మిషన్లు చేయిస్తేనే స్కూల్కు రావాలని.. అలా అయితేనే వేతనాలు ఇస్తామని విద్యా సంస్థలు మెలిక పెడుతుండటంతో ప్రైవేట్ టీచర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. నెల్లూరులోని ఓ ప్రైవేట్ విద్యా సంస్థ యాజమాన్యం ఇలాగే ఓ ఉపాధ్యాయుడిని తొలగించడంతో.. కుటుంబ పోషణ కోసం ఆయన అరటిపండ్లు అమ్ముతున్నారు.
Recommended Video
ఎవరా టీచర్..
నెల్లూరులోని స్టోన్హోస్పేటలో ఉన్న ఓ విద్యా సంస్థ బ్రాంచిలో పట్టెం వెంకటసుబ్బయ్య తెలుగు టీచర్గా పనిచేసేవారు. ఎంఏ తెలుగు, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బీఈడీ విద్యార్హతలు ఉన్న ఆయన.. రెండేళ్లుగా అక్కడ పనిచేస్తున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో ఆయన ఆన్ లైన్లో పాఠాలు బోధించారు. అయినప్పటికీ ఏప్రిల్ నెలలో సగం జీతమే ఇచ్చారు. మే నెలలో అసలు జీతం ఇవ్వకపోగా.. 7 నుంచి 10 అడ్మిషన్లు చేయిస్తేనే జీతం ఇస్తామని యాజమాన్యం మెలిక పెట్టింది. అడ్మిషన్లు చేయించకపోతే స్కూల్కు రావొద్దని చెప్పింది.
ఇదీ వెంకట సుబ్బయ్య ఆవేదన..
చేసేది లేక వెంకట సుబ్బయ్య కుటుంబ పోషణ కోసం స్థానికంగా అరటిపండ్లు అమ్మడం మొదలుపెట్టాడు. 'గతేడాది నేను కొత్త అడ్మినిషన్లు చేయించగలిగాను. కానీ ఈసారి కరోనా కారణంగా ఎవరూ ఎవరినీ ఇళ్లల్లోకి రానివ్వట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త అడ్మిషన్లు ఎలా సాధ్యం. కానీ మా యాజమాన్యం మాత్రం నన్ను ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో మరో ఆప్షన్ లేక,మే 20 నుంచి నేను అరటిపండ్లు అమ్ముతున్నాను.' అని సుబ్బయ్య చెప్పుకొచ్చారు. ఆదివారం(జూన్ 7) పలు టీవీ చానెళ్లు,వార్తా పత్రికల ద్వారా వెలుగుచూడటంతో చాలామంది ఆశ్చర్యపోయారు. ఒక టీచర్కు ఇలాంటి పరిస్థితి రావడమేంటని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరో 50 మంది టీచర్లకు ఉద్వాసన..
ఇది కేవలం ఒక వెంకట సుబ్బయ్య వ్యథ మాత్రమే కాదు. ఇటీవలి కాలంలో ఒక్క నెల్లూరు జిల్లాలోనే ఆ విద్యా సంస్థల 40 నుంచి 50 మందిని ఉద్యోగాల్లో నుంచి తొలగించినట్టు చెబుతున్నారు. నెల్లూరులోని స్టోన్హోస్పేట అరుణాచలం బ్రాంచి స్కూల్లో ఐదుగురు టీచర్లను,మినీబైపాస్ బ్రాంచిలో పనిచేస్తున్న మరో ఏడుగురు టీచర్లనూ ఆ విద్యా సంస్థ ఉద్యోగాల్లో నుంచి తొలగించినట్టు తెలుస్తోంది. ఉన్నపళంగా ఉద్యోగాలు పోవడంతో ఒక్కసారిగా రోడ్డున పడినట్టయింది. ఇంటి అద్దెలు చెల్లించలేక కొంతమంది సొంత ఊళ్లకు వెళ్లిపోగా.. మరికొందరు చిరు వ్యాపారాలు చేసుకుంటూ బతుకు వెళ్లదీస్తున్నారు.