వైసీపీ మహిళా ఎమ్మెల్యేపై అభ్యంతరకర పోస్టులు: ఇద్దరి అరెస్టు
నెల్లూరు: రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యురాలు విడదల రజినీపై సోషల్ మీడియాలో అభ్యంతరక వ్యాఖ్యానాలతో కూడిన పోస్టులను చేసిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరూ నెల్లూరు జిల్లాకు చెందిన వారే. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగంలో క్రియాశీలకంగా ఉంటున్నట్లు గుర్తించారు. ఇద్దర్నీ అరెస్టు చేసి, గుంటూరు జిల్లా చిలకలూరి పేటకు తీసుకెళ్లారు.
విడదల రజినీ.. చిలకలూరిపేట నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రెండు రోజుల కిందట ఆమెపై ఫేస్ బుక్ లో ఇద్దరు వ్యక్తులు అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారని విడదల రజినీ అనుచరుడు ఎం నాగరాజు చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితులను గుర్తించారు.
నెల్లూరు జిల్లా విడవలూరుకు చెందిన సత్యంరెడ్డి విడదల రజినీ ఫొటోపై ఫేస్ బుక్ లో అభ్యంతరకర వ్యాఖ్యలతో పోస్టింగ్ పెట్టినట్లు గుర్తించారు. అదే జిల్లా రాపూరు మండలం కండలేరుకు పీ ప్రవీణ్ అసభ్యకర కామెంట్స్ పెట్టాడని గుర్తించారు. వారిద్దరి అరెస్టు చేయడానికి చిలకలూరిపేట పోలీసులు ఆదివారం జిల్లాకు వచ్చారు. నిందితులను అరెస్టు చేసి, చిలకలూరిపేట తరలించారు. సోమవారం ఇద్దర్నీ న్యాయస్థానంలో హాజరుపరుస్తారని అంటున్నారు.