నెల్లూరులో మహిళ దారుణ హత్య... డెడ్ బాడీని రోడ్డుపై పడేసి వెళ్లిన దుండగులు...
నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. కావలిలోని పుచ్చలపల్లివారి వీధిలో గురువారం(అగస్టు 27) కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఓ వివాహితను హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని నడిరోడ్డుపై పడేసి పరారయ్యారు.
వివరాల్లోకి వెళ్తే... కావలికి చెందిన షకీల(25) అనే మహిళకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. అయితే భర్తతో విబేధాల కారణంగా ఏడాది క్రితం విడాకులు తీసుకుంది. అప్పటినుంచి పట్టణంలోని ఇస్లాంపేటలో ఉన్న తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. స్థానికంగా ఓ ప్లాస్టిక్ దుకాణంలో పనిచేస్తోంది. పుచ్చపల్లి వీధిలో నివాసం ఉంటున్న ఓ మహిళతో ఉన్న పరిచయంతో తరుచూ ఆమె ఇంటి వద్దకు వెళ్లి వస్తుండేది.
Recommended Video
ఇదే క్రమంలో గురువారం కూడా షకీల ఆమె ఇంటికి వెళ్లింది. అయితే అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు... కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆమెతో గొడవ పడ్డారు. కాసేపటికే అది ఘర్షణగా మారింది. ఈ క్రమంలో దుండగులు ఆమెను కిరాతకంగా హత్య చేసి పరారయ్యారు. మృతదేహాన్ని రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. ఘటనపై సమాచారం అందడంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. షకీల స్నేహితురాలైన మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఆర్థిక లావాదేవీలే కారణమా.. వివాహేతర సంబంధమేమైనా ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.