నెల్లూరు షార్ సెంటర్లో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు.. సందర్శకులకు అనుమతి..!
నెల్లూరు : శ్రీహరి కోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) లో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎంఆర్ఆర్ విభాగం కో ఛైర్మన్గా వ్యవహరిస్తున్న డాక్టర్ నారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి వారోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 10 వరకు వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా షార్ సెంటర్ను సందర్శించే అవకాశం కల్పిస్తున్నారు. 4, 9 తేదీల్లో సందర్శకుల కోసం సౌండింగ్ రాకెట్ ప్రయోగాలను నిర్వహిస్తున్నారు.
ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను ప్రారంభించిన అనంతరం డాక్టర్ నారాయణ మాట్లాడుతూ.. అంతరిక్ష పరిశోధనల్లో మన దేశం ఎంతో ముందంజలో ఉందని కొనియాడారు. అంతరిక్ష ప్రయోగాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడతారని ప్రశ్నించే వారికి ఆయన ధీటైన సమాధానం చెప్పారు.
దీపావళి పండుగ కోసం పటాసులు కాల్చడానికి దాదాపు 600 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తారనేది ఒక అంచనా ఉందని.. అయితే మంగళయాన్ ప్రయోగం కోసం ఇస్రో కేవలం వెయ్యి కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి విజయం సాధించడం గొప్ప పరిణామమని చెప్పుకొచ్చారు. ప్రపంచ దేశాలు చేయలేని సాహసం ఇస్రో చేపట్టిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మంగళయాన్ సక్సెస్తో భారత్ ప్రపంచ దేశాల సరసన చేరిందని వెల్లడించారు.
ఆ పోస్టు కోసం ఎంత తెగింపు.. మంత్రి కేటీఆర్ సంతకం ఫోర్జరీ..!
ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను ఈసారి ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో 15 ప్రాంతాల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు షార్ సంచాలకులు రాజరాజన్. ఈ వారోత్సవాల సందర్భంగా అంతరిక్ష ప్రయోగాల ప్రదర్శనతో పాటు విద్యార్థులకు వివిధ రకాల పోటీలు ఉంటాయని చెప్పారు.
విద్యార్థులకు స్పేస్ పరిశోధనలపై అవగాహన కలిగించేలా కార్యక్రమాలు రూపొందించినట్లు చెప్పుకొచ్చారు వారోత్సవాల నిర్వాహక కమిటీ ఛైర్మన్ వెంకట రామన్. సౌండ్ రాకెట్ ప్రయోగం వీక్షించడానికి అనువుగా విద్యార్థులను అనుమతిస్తున్నట్లు తెలిపారు.