వైసీపీ నెక్స్ట్ టార్గెట్ మాజీమంత్రి సోమిరెడ్డి..ఓ భూ వివాదంలో కేసు నమోదు...నోటీసులు జారీ
ఏపీ మాజీ మంత్రి , టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఊహించని షాక్ తగలింది. ఇప్పటికే వైసీపీ అధికారంలోకి వచ్చాక మాజీ మంత్రులు , కీలక నాయకుల మీద కేసుల పర్వం కొనసాగుతుంది. ఇక ఇప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంతు వచ్చింది . ఓ భూ వివాదం కేసులో పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు.
యాదాద్రిలో గులాబీ ప్రచారానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్న లక్ష్మణ్
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఇడిమేపల్లి గ్రామంలో తలెత్తిన భూ వివాదంపై సమాధానం చెప్పాలని ఆయనకు నోటీసులు ఇచ్చారు పోలీసులు . నెల్లూరు రూరల్ సర్కిల్ సీఐ రామకృష్ణ పేరిట తయారైన నోటీసును వెంకటాచలం ఎస్ఐ కరీముల్లా శుక్రవారం అల్లీపురంలోని సోమిరెడ్డి నివాసానికి వెళ్లి అందజేశారు. శుక్రవారం సాయంత్రం కోర్టు ఆదేశాలతో, వెంకటాచలం మండలంలోని ఇడిమేపల్లి రెవెన్యూ డివిజన్ కింద ఫోర్జరీ పత్రాలతో సర్వే నెం .58-3లో 2.41 ఎకరాల భూమిని అమ్మడంపై సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డిపై ఎ 1 గా కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు .
ఇడిమేపల్లిలో కొందరు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దానికి సంబంధించిన అంశాలను విచారించేందుకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. దీంతో మాజీ మంత్రి సోమిరెడ్డి కి కేసుల బాధ తప్పలేదని చెప్పొచ్చు . 91 సీఆర్పీసీ మేరకు కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేసిన పోలీసులు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నోటీసు అందజేసి ఒక గంట వ్యవధిలో అంటే 7 గంటలకు వెంకటాచలం వచ్చి వివరాలు చెప్పాలని పేర్కొన్నారు .
దీనిపై సోమిరెడ్డి తాజాగా స్పందించారు. గంట సమయంలో విచారణకు ఎలా హాజరు అవుతారని ప్రశ్నించారు. పైగా ఈ నెల మూడో తేదీన నోటీసు జారీ చేసినట్లు అందులో ఉండటంతో దానిని సరిచేయాలని సోమిరెడ్డి సూచించారు. అనంతరం ఉన్నతాధికారులతో మాట్లాడిన ఎస్ఐ సోమవారం హాజరుకావాలని సోమిరెడ్డిని కోరారు. దీనికి ఆయన సమ్మతించారు. మొత్తానికి సోమి రెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై ఫోర్జరీ కేసుతో ఆయన సైతం ఇప్పుడు చిరాకు పరిస్థితి ఎదుర్కొంటున్నారు.