తెలుగునాడు విద్యార్థి సమాఖ్య నాయకుడిపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తల దాడి
నెల్లూరు: తెలుగుదేశం పార్టీ అనుబంధంగా కొనసాగుతున్న తెలుగునాడు విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షుడు కాకర్ల తిరుమల నాయుడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు దాడి చేశారు. ఆయనను తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో గాయపడిన తిరుమల నాయుడును స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నారు. ఆదివారం ఉదయం నెల్లూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. టీడీపీ జిల్లా నాయకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేపట్టారు. తిరుమల నాయుడిపై దాడి చేసిన వారిని సిట్టింగ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వర్గీయులుగా అనుమానిస్తున్నారు.
స్పీకర్ ఫై దాడి కేసు .. ఇనుమెట్లలో పోలీసుల గాలింపు .. ఉద్రిక్తత
ఆదివారం ఉదయం నెల్లూరులో మార్కెట్ సమీపంలో బైక్ పై వెళ్తున్న తిరుమల నాయుడిని వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలుగా అనుమానిస్తున్న కొందరు యువకులు అడ్డుకున్నారు. తమ పార్టీ సానుభూతిపరులను ఎందుకు ప్రలోభానికి గురి చేశావంటూ నిలదీశారు. డబ్బులు, మద్యం, క్రీడాసామాగ్రిని ఎరగా వేసి, తమ పార్టీ ఓటర్లను ప్రలోభానికి గురి చేయడం వెనుక ఆంతర్యమేమిటంటూ ప్రశ్నించారు. తాను అలాంటి చర్యలేమీ చేయలేదని తిరుమల నాయుడు బదులిచ్చారు. ఈ క్రమంలో వారి మధ్య పెద్ద ఎత్తున వాగ్యుద్ధం చోటు చేసుకుంది. తీవ్ర ఆగ్రహానికి లోనైన వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ఇనుప రాడ్లు, కర్రలతో తిరుమల నాయుడిపై దాడి చేశారు. చితకబాదారు.
ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. దీన్ని గమనించిన స్థానికులు తిరుమల నాయుడినిపై సింహపురి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు. దాడికి పాల్పడిన వారు వైఎస్ఆర్సీపీకి చెందిన నెల్లూరు రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వర్గీయులుగా అనుమానిస్తున్నారు. స్థానిక టీడీపీ నాయకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.