కన్నతండ్రిపై పోలీసులకు 8 ఏళ్ల బాలుడి ఫిర్యాదు.. ఇంతకు ఏం జరిగిందంటే..!
నిజామాబాద్ : కాలం మారింది. పిల్లల ప్రవర్తనలో కూడా మార్పు కనిపిస్తోంది. ఏ విషయంలోనైనా వెంటనే స్పందిస్తున్నారు. అదే క్రమంలో నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసిన ఘటన చర్చానీయాంశమైంది. తన తండ్రిపై ఎనిమిదేళ్ల బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడనే వార్త జిల్లా వ్యాప్తంగా వైరల్ అయింది.
నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని వడ్డేపల్లికి చెందిన బాలుడు తన తండ్రిపై పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఎనిమిదేళ్ల వయసున్న మహేశ్ కన్న తండ్రిపై ఈ విధంగా ఫిర్యాదు చేయడం చర్చానీయాంశంగా మారింది. తనను తండ్రి రోజు కొడుతున్నాడనేది ఆ ఫిర్యాదు సారాంశం. తండ్రి వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపిస్తూ పోలీసుల ఎదుట కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ ఘటనతో చలించి పోయిన పోలీసులు బాలుడి తల్లిదండ్రులను స్టేషన్కు పిలిపించారు.
ఖాకీల ప్రవర్తన సరిగా లేదు.. జైళ్లల్లో పేదలే.. పోలీస్ అకాడమీ డైరెక్టర్ వీకే సింగ్ హాట్ కామెంట్స్..!
బాలుడి నుంచి పూర్తి వివరాలు సేకరించిన ఎస్సై అనిల్ రెడ్డి.. అతడి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. పెద్దల మధ్య గొడవ పిల్లల వరకు రానీయొద్దని సూచించారు. భార్యాభర్తల మధ్య గొడవలు జరిగితే పిల్లల మీద ప్రతాపం చూయించడమేంటని ప్రశ్నించారు. ఇకపై పిల్లలను కొట్టొద్దని.. జాగ్రత్తగా చూసుకోవాలని మందలించారు. దాంతో సరేనంటూ తల్లిదండ్రులు బాలుడిని తీసుకుని ఇంటికి వెళ్లిపోయారు.
ఇటీవల నల్గొండ జిల్లాలో కూడా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. తల్లిదండ్రులు తనను స్కూలుకు పంపించడం లేదంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. చివరకు ఖాకీల జోక్యంతో ఆ తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించడంతో సదరు బాలుడు స్కూలుకు వెళ్లేందుకు అవకాశం దొరికింది.
అదలావుంటే ఆ మధ్య హైదరాబాద్లో రాత్రి పూట ఓ బుడతడు వడివడిగా పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు. తనను ఆడుకోకుండా నానమ్మ అడ్డుకుంటోందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎలాగైనా కేసు పెట్టాలని పంతం పట్టాడు. ఆ బుడ్డోడికి ఏం చెప్పాలో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు. చివరకు చాక్లెట్లు గట్రా ఇచ్చి శాంతింపజేశారు. ఇది ఫన్నీ ఇన్సిడెంట్గా కనిపించినా.. పిల్లల్లో మారుతున్న ధోరణికి అద్దం పట్టింది.