ఆశకు పోయి అన్నీ అమ్ముకుని..సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో 16 లక్షలు పోగొట్టుకున్న దంపతులు
ఏ కాల్స్ పడితే ఆ కాల్స్ మాట్లాడకండి. మీరు ఆ నగదు గెలుచుకున్నారు, ఈ గిఫ్ట్ గెలుచుకున్నారు అంటూ సైబర్ మోసాలకు పాల్పడే నేరగాళ్ళ సంఖ్య పెరిగింది అని పోలీసులు ఎన్ని సార్లు హెచ్చరించినా ఆశకు పోయి సైబర్ మోసగాళ్ళ చేతిలో నిలుపు దోపిడీకి గురవుతూనే ఉన్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక దంపతులజంట సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. 16 లక్షలు పోగొట్టుకుని లబోదిబోమంటున్నారు. ఇల్లు, పుస్తెలు అమ్మి మరీ సైబర్ నేరగాళ్లకు సమర్పించుకున్నారు.
నిజామాబాద్ జిల్లాలో సైబర్ మోసం
ఇక అసలు విషయానికి వస్తే ఆర్మూర్ మండలం, చేపూరుకు చెందిన అశోక్ అనే వ్యక్తి ఊరిలో ఉపాధి లేక బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్లాడు .. గత 3 సంవత్సరాలుగా కువైట్ లో లేబర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.. అయితే గత నెల రోజుల క్రితం అతనికి ఒక మెసేజ్ వచ్చింది.. నీకు నలభై ఆరు లక్షల రూపాయల లాటరీ తగిలింది.. నువ్వు పదహారు లక్షల రూపాయల డబ్బులు వేస్తే నీకు లాటరీ డబ్బులు పంపిస్తామని అతనికి ఫోన్ ద్వారా విషయాన్ని చెప్పారు.
కువైట్లో భర్త , ఇండియాలో భార్య సైబర్ నేరగాళ్లకు సొమ్ము డిపాజిట్
దీంతో అతని వద్ద ఉన్న ఐదు లక్షల రూపాయలతో పాటు ఇండియా నుంచి భార్య ద్వారా పదకొండు లక్షల రూపాయలను వారికి ట్రాన్స్ఫర్ చేశాడుఅశోక్ . ఇక అశోక్ మొత్తం పదహారు లక్షల రూపాయలు డబ్బులు చెల్లించాడు.. చివరకు డబ్బులు వేశాక అతనితో మాట్లాడిన వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు.
దీంతో మోసపోయానని గ్రహించి ఇప్పుడు లబోదిబోమంటూ విలపిస్తున్నారు. 16 లక్షలు డబ్బులు కడితే నలభై ఆరు లక్షల రూపాయల లాటరీ డబ్బులు వస్తాయని చెప్పడంతో నమ్మి మోసపోయామని చెప్తోంది ముత్తమ్మ.
నలభై ఆరు లక్షల రూపాయల లాటరీ డబ్బులు వస్తాయని మోసం
తన భర్త మాటలు నమ్మి వారి వద్ద వీరి వద్ద అప్పులు చేసి బంగారం అమ్మి, ఉన్న ఇంటిని కూడా అమ్మి 11లక్షల రూపాయలు చెల్లించాలని ముత్తమ్మ లబోదిబోమంటుంది. మాకు న్యాయం చేసి మా డబ్బులు మాకు ఇప్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేశామని అయినా ఇప్పటికీ ఎలాంటి స్పందన లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని తమ బిడ్డల జీవితాలను కాపాడమని వేడుకుంటుంది..
లాటరీ పేరుతో కార్మికులు మోసపోవద్దన్న గల్ఫ్ వెల్ఫేర్ అసోసియేషన్
లాటరీ పేరుతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు గల్ఫ్ లో ఉన్న వారు ఎవరూ ఇలాంటివి నమ్మవద్దని తెలిపారు. ఇలాంటి మోసాలు ఎవరికీ జరగకూడదు ఇలాంటి మోసాలను అరికట్టాలని ప్రెస్ మీట్ పెట్టి మరీగల్ఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడారు . బ్రతుకు దెరువు కోసం గల్ఫ్ దేశం వెళ్లి రూపాయి రూపాయి కూడబెట్టుకున్న ఇలాంటి కార్మికులు ఇంత పెద్ద ఎత్తున నష్టపోవడం బాధాకరమని వారు పేర్కొన్నారు.