భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకున్న బండి సంజయ్... హైటెన్షన్... ఏం జరగబోతుంది...
ఇవాళ(నవంబర్ 20) తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చార్మినార్ టూర్తో హైదరాబాద్లో హైటెన్షన్ నెలకొంది. వరద సాయం ఆపాలని ఈసీకి లేఖ రాసినట్లుగా తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన సంజయ్... దానిపై భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఈసీకి తాను లేఖ రాయలేదని అమ్మవారిపై ప్రమాణం చేస్తానని... కేసీఆర్ కూడా ఆయన చెప్పేది నిజమైతే అమ్మవారిపై ప్రమాణం చేయాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే బండి సంజయ్ భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించగా.. ఆలయ పూజారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అంతకుముందు, పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు ఎవరైనా వెళ్లవచ్చునని, అందుకోసం ప్రత్యేక అనుమతులు అవసరం లేదని స్పష్టం చేశారు. దీంతో బండి సంజయ్ చార్మినార్ టూర్కి అడ్డంకులు తొలగిపోయాయి. బండి సంజయ్కు పోలీసులు అనుమతినివ్వట్లేదని జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో బైక్ ర్యాలీలు,రాజకీయపరమైన కార్యక్రమాలకు మాత్రం అక్కడ అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.
మరోవైపు బండి సంజయ్ పర్యటన నేపథ్యంలో భాగ్యలక్ష్మి ఆలయం వద్ద పోలీసులు మూడంచెల బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు నాంపల్లిలోని బీజేపీ ఆఫీస్ వద్ద కూడా భారీగా పోలీసులను మోహరించారు. దీంతో భాగ్యలక్ష్మి ఆలయం వేదికగా ఏం జరగబోతుందన్న టెన్షన్ నెలకొంది.
కాగా,గురువారం(నవంబర్ 19) మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. ప్లాన్ ప్రకారం లెటర్ రాయించి.. తన సంతకాన్ని ఫోర్జరీ చేయించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలెవరూ ఆ దుష్ప్రచారాన్ని నమ్మేందుకు సిద్దంగా లేరన్నారు. భాగ్యలక్ష్మి ఆలయ సాక్షిగా తాను లేఖ రాయలేదని ప్రమాణం చేసేందుకు సిద్దంగా ఉన్నానన్నారు. గురువారం(నవంబర్ 20) మధ్యాహ్నం 12గంటలకు కేసీఆర్ అక్కడికి వచ్చి తన నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. కేసీఆర్ మూర్ఖత్వపు పాలనకు సమాధి కట్టేందుకు రేపటి ముహూర్తమే నాంది అన్నారు. కేసీఆర్ నిజంగా హిందువైతే... మగాడైతే... సవాల్ స్వీకరించాలన్నారు. బిడ్డా కేసీఆర్ చుక్కలు చూపిస్తామంటూ హెచ్చరించారు.