కేసీఆర్ వైఖరితోనే మతమార్పిడులు: నియంత పాలనకు సమాధేనంటూ బండి సంజయ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు న్యాయం చేసేందుకు ఉద్యమం చేస్తామన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. గిరిజనులకు సీఎం కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ నాయక్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు.
దుబ్బాక గెలుపు: బండి సంజయ్కి అమిత్ షా అభినందనలు, ఇంకా ఏమన్నారంటే..?
హుస్సేన్ నాయక్ను సన్మానించిన అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. లాక్డౌన్ గిరిజన సోదరులు ఇబ్బంది పెడితే కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ తప్ప.. కేసీఆర్ రూపాయి కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. పేదలు ఇబ్బంది పడ్డారు కాబట్టే దుబ్బాకలో పేదలంతా పేదలంతా ఒక్కటై బీజేపీని గెలిపించారన్నారు. గిరిజనులకు బీజేపీ అండగా ఉంటుందన్నారు.
త్వరలో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పేదలంతా ఒక్కటై కేసీఆర్కు గుణపాఠం చెప్పాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కేసీఆర్ వ్యవహారశైలితో మతమార్పిడులు జరుగుతున్నాయని ఆరోపించారు. దేశంలో ఎక్కడా ఇంతగా మతమార్పిడులు జరగడం లేదని అన్నారు.
హిందూ ధర్మాన్ని అవమానిస్తే సహించబోమని బండి సంజయ్ హెచ్చరించారు. దుబ్బాక ఉపఎన్నిక టీఆర్ఎస్ పార్టీకి చెంపపెట్టని అన్నారు. దుబ్బాకలానే హైదరాబాద్ ప్రజలు కూడా బీజేపీని ఆదరిస్తారన్నారు. దుబ్బాక ప్రజలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఈ సందర్భంగా మరోసారి ధన్యవాదాలు తెలిపారు.
సీఎం కేసీఆర్కు అహంకారం ఎక్కువ అని, రాష్ట్రంలో నియంత, దౌర్భాగ్య, అవినీతి పాలన జరుగుతోందని దుయ్యబట్టారు. ఈ నియంత పాలనకు సమాధి కట్టాలంటే.. బీజేపీతోనే సాధ్యమైందన్నారు. తెలంగాణలో రామరాజ్య స్థాపన జరగాలని భావించి దుబ్బాక ప్రజలు స్ఫూర్తిదాయకమైన తీర్పు ఇచ్చారని సంజయ్ అన్నారు.