రోహింగ్యాలకు పాస్ పోర్టా..? ఉద్యమిస్తాం, అర్వింద్ స్పష్టీకరణ
రోహింగ్యాలకు పాస్ పోస్టు అంశంపై ఉద్యమిస్తామని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఈ అంశంపై కేంద్రం ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామని చెప్పారు. శుక్రవారం ఆయన నిజామాబాద్ ఆదర్శ్ నగర్లో చత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. దొంగ పాస్పోర్టుల వ్యవహారంపై సీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రోహింగ్యాలకు పాస్పోర్టుల జారీ అంశంపై కేంద్ర హోంశాఖకు లేఖ రాశామని తెలిపారు. వారికి పాస్ పోర్టు జారీ అంశాన్ని అంత తేలికగా వదలబోమని చెప్పారు. దీనిపై ఎన్ఐఏ ద్వారా విచారణ జరిపిస్తామని అర్వింద్ ప్రకటించారు. హైదరాబాద్ పాతబస్తీలో రోహింగ్యాలు ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో అర్వింద్ కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రోహింగ్యాలు ఉన్నారని బీజేపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. కానీ దీనిపై అధికార టీఆర్ఎస్ పార్టీ తప్పుపడుతోంది. అలాంటి వారెవరూ లేరని చెబుతూ వస్తోంది.
ఈ సారి ఏకంగా రోహింగ్యాల పాస్ పోర్టు అంశాన్ని బీజేపీ ఎంపీ అర్వింద్ ప్రస్తావించడం విశేషం. మరీ దీనిపై టీఆర్ఎస్ పార్టీ నుంచి కౌంటర్ ఏ విధంగా వస్తుందో చూడాలీ. టీఆర్ఎస్- మజ్లిస్ కలిసి రోహింగ్యాలను వెనకెసుకు వస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే అర్వింద్ రోహింగ్యాలకు పాస్ పోర్ట్ అనే అంశాన్ని ప్రస్తావించారు.