ఓవైసీ గడ్డం క్షవరం చేసి కేసీఆర్కు అతికిస్తాం: ఎంపీ అరవింద్ వివాదాస్పద వ్యాఖ్యలు
నిజామాబాద్ : బీజేపీ నేత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టంను వ్యతిరేకిస్తున్న మజ్లిస్ అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని హెచ్చరిస్తూ ఎంపీని తలకిందులుగా వ్రేలాడదీసి గడ్డం క్షవరం చేయాలని అన్నారు. క్షవరం చేసిన గడ్డాన్ని తాను సీఎం కేసీఆర్కు అతికిస్తామని చెప్పారు. అప్పుడు కేసీఆర్ కూడా ముల్లాలా గుర్తింపు పొందుతారనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఎంపీ అరవింద్ వివాదాస్పద వ్యాఖ్యలు
నిజామాబాదులో జరిగిన ఓ బహిరంగ సభలో ఎంపీ అరవింద్ అసదుద్దీన్ ఓవైసీ, ముఖ్యమంత్రి కేసీఆర్పై ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ మరియు బీజేపీలను చీల్చి చెండాడుతామని అన్న ఓవైసీ వ్యాఖ్యలపై ఘాటుగా సమాధానం ఇచ్చారు అరవింద్. 9 ఏళ్ల క్రితం సొంత తమ్ముడైన అక్బరుద్దీన్పై సొంత సామాజిక వర్గానికి చెందిన వారే కత్తితో దాడి చేశారని అదికూడా తమ ప్రాంతంలోనే దాడి చేశారని గుర్తు చేశారు. ఇంకా అక్బరుద్దీన్ ఈ గాయం నుంచి కోలుకోలేదని చెప్పిన అరవింద్... అప్పుడే మీరు ఏమీ చేయలేకపోయారని బీజేపీని చీల్చుతామని మాట్లాడుతారా అని ప్రశ్నించారు.
ఓవైసీ గడ్డం క్షవరం చేసి కేసీఆర్కు అతికిస్తాం
నిజామామాదులోని ఈద్గా గ్రౌండ్స్లో మజ్లిస్ సమావేశం నిర్వహించిందని అదే గ్రౌండ్లోకి ఓ భారీ క్రేన్ను తీసుకొచ్చి అసదుద్దీన్ను తలకిందులుగా వేలాడదీసి గడ్డం క్షవరం చేస్తానని చెప్పారు అరవింద్. ఆ గెడ్డాన్ని పడివేయకుండా కేసీఆర్కు అతికించి గెడ్డానికి ప్రమోషన్ ఇస్తానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎంపీ అరవింద్. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా నిజామాబాదులో వారం క్రితం అసదుద్దీన్ ఓవైసీ ఓ సమావేశం నిర్వహించారు. సీఏఏ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉండటమే కాకుండా బీజేపీ ప్రభుత్వం దేశాన్ని ప్రమాదంలోకి నెట్టివేస్తుందని వ్యాఖ్యానించారు.
సీఎం కేసీఆర్ ముల్లాలా మారిపోయారు
ఇక పార్లమెంటు సమావేశాల సందర్భంగా పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకించిన టీఆర్ఎస్, సీఎం కేసీఆర్పై కూడా అరవింద్ ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ ముల్లాలా మారిపోయారని , ముఖ్యమంత్రి పేరుతో ముల్లాలా కేసీఆర్ ఉన్నారని అరవింద్ ధ్వజమెత్తారు. కొడుకు కేటీఆర్ నాస్తికుడు అన్న అరవింద్... హిందూ ధర్మ గురించి వారికేం తెలుసని ప్రశ్నించారు. ఇలాంటి వారు లౌకికత్వం గురించి మాట్లాడుతారా అని ప్రశ్నించారు అరవింద్.
నాలుగు బస్సులు తగలబెడితే భయపడం
ఎంతమంది వ్యతిరేకించినప్పటికీ పౌరసత్వ సవరణ చట్టంపై బీజేపీ వెనకడుగు వేయదని స్పష్టంచేశారు. నలుగురు కలిసి నాలుగు బస్సులు తగలబెట్టినంత మాత్రాన భయపడి వెనక్కు తగ్గుతామనుకుంటూ పొరపాటే అని అరవింద్ అన్నారు. భవిష్యత్తులో మరిన్ని సాహసోపేతమైన చట్టాలు వస్తాయని అయితే వాటి గురించి తాను ఇప్పుడు ప్రస్తావించబోనని చెప్పిన అరవింద్ కచ్చితంగా వచ్చి తీరుతాయని వెల్లడించారు.