నిజామాబాద్ జిల్లాలో నాటుబాంబుల కలకలం.. మృత్యువాత పడ్డ ఆవు
నిజామాబాద్ : జిల్లాలో నాటు బాంబుల వ్యవహారం కలకలం రేపింది. డిచ్పల్లి మండలంలోని సుద్దపల్లి అటవీప్రాంతంలో నాటు బాంబు పేలడంతో చర్చానీయాంశమైంది. అరుదైన అలీకర్ జాతికి చెందిన ఆవు మృత్యువాత పడటంతో స్థానికంగా విషాదం నెలకొంది.
సుద్దపల్లి అటవీప్రాంతంలోనే గాకుండా అటు తెలంగాణ యూనివర్సిటీకి చెందిన స్థలంలో వేటగాళ్లు నాటు బాంబులు పెడుతున్నట్లుగా తెలుస్తోంది. వన్యప్రాణులను వేటాడటమే లక్ష్యంగా నాటుబాంబులకు ఆహార పదార్థాలను జతచేస్తున్నట్లు సమాచారం. ఆ క్రమంలోనే బుధవారం నాడు గడ్డి మేస్తూ అటుగా వెళ్లిన ఆవు.. నాటు బాంబుకు చుట్టి ఉన్న ఆహార పదార్థాలను తినే ప్రయత్నంలో అది పేలింది. తీవ్రగాయాలు కావడంతో అది స్పాట్ లో ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు చెబుతున్నారు.
కన్నవారిని వదిలి.. ఉన్న ఊరును విడిచి.. ఎడారి దేశంలో ఎంత కష్టం (వీడియో)
అరుదైన అలీకర్ జాతికి చెందిన ఆవు డిచ్పల్లి ప్రాంతంలోని అంకుష్ గోశాలకు చెందినట్లుగా తెలుస్తోంది. ఆ గోశాలలో దాదాపు 25 రకాల జాతులకు పైగా 500 ఆవులు ఉన్నట్లు సమాచారం. అయితే వాటి మేతకు సమీపంలోని సుద్దపల్లి అటవీప్రాంతంలోకి తీసుకెళతారు నిర్వాహకులు. అలా వెళ్లినప్పుడు నాటు బాంబు కారణంగా ఆవు మృత్యువాత పడింది. ఆ మేరకు డిచ్పల్లి పొలీస్స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది.
వన్యప్రాణులను వేటాడటం నిషేధమే అయినప్పటికీ.. స్మగ్లర్లు రెచ్చిపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. పేలుడు పదార్థాలు యధేచ్ఛగా వినియోగిస్తూ మూగ జీవుల ప్రాణాలు తీస్తున్నారనే ఆరోపణలు కొకొల్లలు.