ఆఖరుకు వినాయక చందాను కూడా వదలకుండా వాడుకుంటున్న చోర శిఖామణులు
వినాయక చవితి సమీపిస్తుంది. గణేష్ నవరాత్రుల చందాల కోసం వాడవాడలా హడావుడి కనిపిస్తోంది. సందట్లో సడేమియా అంటూ వినాయక చవితి చందాల పేరుతో చైన్ స్నాచింగ్ లకు పాల్పడవచ్చని ప్లాన్ చేసుకున్నారు ఇద్దరు ప్రబుద్ధులు. అందులో భాగంగా వినాయక చవితి వస్తుండడంతో చందా వసూళ్ల ముసుగులో ఇద్దరు నిందితులు ఓ మహిళ మెడలో చైన్ స్నాచింగ్ కు పాల్పడడం నిజామాబాద్ పట్టణంలో కలకలం రేపింది. పట్టపగలు జరిగిన ఈ ఘటనలో ఇద్దరు నిందితుల్లో ఒకరు చేతికి చిక్కడంతో స్థానికులు పోలీసులకు అప్పగించారు.ఇక గణేష్ చందాలను కూడా వదలని వీరి అఘాయిత్యానికి అవాక్కయ్యారు.
బీజేపీలో అరవింద్ కు ఘోర అవమానం .. ఢిల్లీ పెద్దల ఆరా .. అసలేం జరిగింది
పోలీసుల కథనం మేరకు... నిజామాబాద్ నగరంలో పట్టపగలు దొంగలు హల్ ఛల్ చేశారు. గణపతి చందా ముసుగులో వచ్చిన దొంగలు చైన్ స్నాచింగ్కు పాల్పడ్డారు. ఈ ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. సాయికృపనగర్ కాలనీలో మొదటి అంతస్థులో ఓ ఇంటికి గణేష్ చందా అంటూ దుండగులు చందా పుస్తకంతో వచ్చారు. డబ్బులు ఇవ్వకపోవడంతో మంచినీళ్లు అడిగి చైన్ స్నాచింగ్కు యత్నించారు.
భయంతో మహిళ అరవడంతో ఆమె భర్త దుండగులను పట్టుకోబోయారు. తప్పించుకోబోయిన దుండగులను పట్టుకుని ఇంటి గేట్లు మూసి వారిని కట్టేసే ప్రయత్నం చేశాడు. దుండగులు ఆయనతో వాగ్వాదానికి దిగారు.
దీంతో కొద్ది సేపు తోపులాట జరిగింది. అక్కడినుంచి తప్పించుకుని ఒక దొంగ పరారయ్యాడు. ఈ ఘటనలో మహిళ భర్తకు గాయాలు అయ్యాయి. పట్టుబడిన దొంగను స్థానికుల సహాయంతో నిజామాబాద్ పోలీసులకు అప్పగించారు. చోరీకి యత్నించినవారు మహారాష్ట్రకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న దొంగ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.