నిజామాబాద్ : ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చిన కరోనా బాధితురాలు...
నిజామాబాద్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ కరోనా బాధితురాలు ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. ఇందులో ఇద్దరు మగ శిశువులు,ఒక ఆడ శిశువు ఉన్నారు. వీరిలో ఇద్దరు 1.2 కిలోల బరువు ఉండగా,ఒకరు 1.5కిలోల బరువు ఉన్నారు. జిల్లాలోని ఎడవల్లి మండలానికి చెందిన మహిళకు ఈ ముగ్గురు శిశువులు జన్మించినట్లు వైద్యులు తెలిపారు.
వైద్యులు చెప్పిన వివరాల ప్రకారం... ఆ మహిళకు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. అయితే సంతానం మాత్రం కలగలేదు. దీంతో ఐయూఐ చికిత్స విధానం ద్వారా ఆమె గర్భం దాల్చింది. 8 నెలల కడుపుతో ఉన్న సమయంలో ఆమె అనారోగ్యం బారినపడింది. దీంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించుకోగా... ఆమెకు కరోనా పాజిటివ్గా తేలింది. అదే సమయంలో ఆమె కడుపులో ముగ్గురు శిశువులు పెరుగుతున్నట్లు వైద్యులు చెప్పారు.
ఆ మరుసటిరోజు ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కరోనాతో పాటు ఉమ్మ నీరు కారణంగా ఆమె ఆరోగ్యం క్షీణించినట్లు గుర్తించారు. వెంటనే ఆమెకు సర్జరీ ద్వారా డెలివరీ చేయగా.. ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. శిశువులకు కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకుని శస్త్రచికిత్స నిర్వహించారు. అనంతరం శిశువులకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా నెగటివ్గా తేలింది. బుధవారం(నవంబర్ 4) తల్లికి వైద్య పరీక్షలు నిర్వహించగా... ఆమెకు కూడా కరోనా నెగటివ్గా తేలింది. దీంతో అందరినీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.
ఈ ఏడాది సెప్టెంబర్లో ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఉన్న బీఆర్డీ మెడికల్ కాలేజీలో ఓ కరోనా బాధితురాలు నలుగురు శిశువులకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. నలుగురు శిశువులు 1.5కిలోల బరువుతో పుట్టారు. ఇది చాలా సవాల్తో కూడుకున్న డెలివరీ అని...సమర్థులైన వైద్య బృందం మహిళకు డెలివరీ చేశారని మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ తెలిపారు.