భూత వైద్యం పేరుతో మహిళలను లొంగదీసుకుంటున్న బాబా... తుక్కు రేగ్గొట్టిన మహిళలు..
రోగాలు,నొప్పులు నయం చేస్తానని... ఎలాంటి సమస్యనైనా తీరుస్తానని... భూత వైద్యం పేరుతో అమాయక మహిళలు,బాలికలపై అత్యాచారాలకు పాల్పడుతున్న దొంగ బాబా వ్యవహారం నిజామాబాద్లో వెలుగుచూసింది. తాజాగా ఓ 15 ఏళ్ల బాలికపై దొంగ బాబా అత్యాచారం బయటపడటంతో అతని లీలలన్నీ వెలుగుచూస్తున్నాయి.
వివరాల్లోకి వెళ్తే... నిజామాబాద్ నగరంలో ఓ వ్యక్తి దొంగ బాబా అవతరామెత్తాడు. ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా... కుటుంబ సమస్యలైనా తీరుస్తానని చెప్పి అమాయకులను మోసం చేస్తున్నాడు. మహిళలను,బాలికలను లోబరుచుకుని అత్యాచారాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో కొన్నాళ్ల క్రితం ఓ దంపతులు తమ 15 ఏళ్ల కుమార్తెకు ఆరోగ్యం బాగా ఉండట్లేదని అతని వద్దకు తీసుకొచ్చారు.
బాలికను పరిశీలించిన దొంగ బాబా కొన్నాళ్లు ఆమెను తనవద్దే ఉంచాలని చెప్పాడు. దీంతో తల్లిదండ్రులు అతన్ని గుడ్డిగా నమ్మి బాలికను అక్కడే వదిలిపెట్టి వెళ్లిపోయారు. అప్పటినుంచి బాలికను బెదిరింపులకు గురిచేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఇటీవల బాలికకు కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు ఆరా తీయడంతో దొంగ బాబా వ్యవహారం గురించి చెప్పింది.
దొంగ బాబా అఘాయిత్యంపై తీవ్ర ఆగ్రహానికి గురైన బాధిత బాలిక తల్లిదండ్రులు,స్థానికులు కలిసి అతన్ని పట్టుకుని చితకబాదారు. రోడ్డు మీదకు తీసుకొచ్చి దేహశుద్ది చేశారు. ఇంతలో పోలీసులు వచ్చి వారిని శాంతింపజేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. బాధిత బాలిక ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గతంలోనూ ఇలా భూత వైద్యం పేరుతో,భక్తి లేదా ఆధ్యాత్మిక పేరుతో మహిళలపై దొంగ బాబాలు అత్యాచారాలకు పాల్పడిన ఘటనలు చాలానే వెలుగుచూశాయి. అయినప్పటికీ అమాయక జనం ఇప్పటికీ వాళ్లను నమ్ముతూ మోసపోతున్నారు. అడిగినంత డబ్బులు ఇచ్చుకోవడంతో పాటు లైంగిక దోపిడీకి గురవుతున్నారు. ఇలాంటి బాబాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా చాలామందిలో మార్పు రావట్లేదు.