ఓట్ల లెక్కింపులో ప్రత్యేకం! ఇందూరులో 30గంటల తర్వాత ఫలితం!
నిజామాబాద్ : సార్వత్రిక ఎన్నికల్లో దేశం దృష్టిని ఆకర్షించిన నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం ఫలితాల వెల్లడిలోనూ ప్రత్యేకతను చాటుకోనుంది. భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో ఉన్నందున ఈ నియోజకవర్గ ఫలితం ఆలస్యం కానుంది. అయితే అది గంటా రెండు గంటలు అనుకుంటే పొరపాటే. దేశవ్యాప్తంగా మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా.. నిజామాబాద్ సీటు రిజల్ట్ మాత్రం ఆ మరుసటి రోజు వెల్లడికానుంది. ఓట్ల లెక్కింపుకు దాదాపు 30 గంటల సమయం పట్టే అవకాశముండటంతో శాసనమండలి ఎన్నికల తరహాలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాతి రోజు అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.
రెండు చోట్ల కౌంటింగ్
నిజామాబాద్ బరిలో 185 మంది అభ్యర్థులు ఉండటంతో 12 బ్యాలెట్ యూనిట్ల ద్వారా అక్కడ ఎన్నిక నిర్వహించారు. నియోజకవర్గ పరిథిలో మొత్తం 1788 పోలింగ్ బూత్లలో పోలైన ఓట్లను రెండు జిల్లా కేంద్రాల్లో లెక్కించాలని అధికారులు నిర్ణయించారు. జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి ఈవీఎంలను జగిత్యాల జిల్లా కేంద్రంలో, నిజామాబాద్ జిల్లాలోని ఐదు అసెంబ్లీ సెగ్మెంట్ల ఈవీఎంలను డిచ్పల్లిలోని కౌంటింగ్ సెంటర్లో లెక్కించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రౌండ్కు 14 టేబుళ్ల చొప్పున ఓట్ల లెక్కింపు జరగగా లోక్సభ ఎన్నికల్లో భారీ సంఖ్యలో ఈవీఎంలు ఉన్నందున ఈసారి కౌంటింగ్ కోసం 18 టేబుళ్లు ఏర్పాటు చేశారు.
ఒక్కో రౌండ్కు రెండు గంటలు
నిజామాబాద్లో ఒక్కో పోలింగ్ స్టేషన్లో 12 బ్యాలెట్ యూనిట్లు వినియోగించారు. ఈ లెక్కన ఒక్కో రౌండ్లో 18 టేబుళ్లపై 216 బ్యాలెట్ యూనిట్లు ఉంచి కౌంటింగ్ జరుపుతారు. అభ్యర్థులవారీగా ఓట్ల లెక్క తేలాలంటే బ్యాలెట్ యూనిట్లలోని నోటా వరకు గుర్తులను వరుస క్రమంలో నొక్కాల్సి ఉంటుంది. ఇలా నోటాతో కలిపి మొత్తం 186 గుర్తులను నొక్కేందుకు దాదాపు రెండు గంటల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
30 గంటల తర్వాత తుది ఫలితం
ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిథిలోని 1788 పోలింగ్ స్టేషన్ల ఓట్లు లెక్కింపునకు 15 రౌండ్లు పట్టే అవకాశముంది. రెండు కౌంటింగ్ సెంటర్లలో అభ్యర్థులవారీగా పోలైన ఓట్లను క్రోడీకరించి ఒక్కో రౌండ్ వారీగా ఫలితం వెల్లడించేందుకు రెండు గంటల సమయం పట్టనుంది. ఇలా 15సార్లు జరగాల్సి ఉండటంతో నిజామాబాద్ ఫలితం తేలేందుుక దాదాపు 30 గంటల సమయం పట్టనుంది. ఈ నేపథ్యంలో ఇందూరు పార్లమెంటు నియోజకవర్గ ఫలితం కోసం మరుసటి రోజు వరకు వేచి చూడక తప్పదు.