స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కవిత.. బరిలో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కు నేడు కవిత నామినేషన్ వేశారు. చాలా కాలంగా కవిత విషయంలో సైలెంట్ గా ఉంటున్న సీఎం కేసీఆర్ కవిత పేరును ప్రకటించటంతో నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది . నిజమాబాద్ స్థానిక సంస్థల కోటా ఎం.ఎల్.సి. టి.ఆర్.ఎస్. అభ్యర్ధినిగా కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. దీంతో పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. ఇక ఇక్కడ నుండి బీజేపీ, కాంగ్రెస్ లు కూడా ఎన్నికల బరిలోకి దిగటం స్థానిక రాజకీయాలను వేడెక్కిస్తుంది.
కవితను ఎం.ఎల్.సి. అభ్యర్థి గా ప్రకటించిన కేసీఆర్
గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ కవితను ఎం.ఎల్.సి. అభ్యర్థి గా ఖరారు చేశారు. ముందుగా హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్ లోని స్పీకర్ నివాసం లో పోచారం ని కవిత మర్యాద పూర్వకంగా కలిశారు. అక్కడి నుంచి నేరుగా నిజామాబాద్ బయదేరిన కవితకు కామారెడ్డిలో టి.ఆర్.ఎస్. నేతలు కవితకు ఘన స్వాగతం పలికారు. ఇంధల్ వాయి టోల్ గేట్ వద్ద నిజామాబాద్ జిల్లా నాయకులు కవితకు స్వాగతం పలికారు. అనంతరం మాధవ్ నగర్ సాయి బాబా ఆలయం లో ప్రత్యేక పూజలు చేశారు.
నిజామాబాద్ లో టీఆర్ఎస్ నుండి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కవిత
నేరుగా కలెక్టర్ కార్యాలయం చేరుకున్న ఆమె మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎం.ఎల్.ఏ. లు ఎం.ఎల్.సి.ల సమక్షంలో నామినేషన్ దాఖలు చేశారు. ఇక మీడియా తో ఆమె మాట్లాడేందుకు నిరాకరించారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న కవిత ఇక ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా మారనున్నారు. 2022 వరకు ఎమ్మెల్సీ పదవీ కాలం ఉండటంతో ఆమెకు తెలంగాణా క్యాబినెట్ లో స్థానం దక్కనుంది అని ప్రచారం జరుగుతుంది.
బీజేపీ నుండి నామినేషన్ వేసిన లక్ష్మి నారాయణ
ఇక ఈ ఎమ్మెల్సీ ఎన్నిక ను ఏకగ్రీవం చేసేందుకు టీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇక టీఆర్ ఎస్ కు పోటీగా బీజేపీ కూడా రంగంలోకి దిగింది. ఇక నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎం.ఎల్.సి. గా పోటీకి బీజేపీ సై అంటోంది. ఆ పార్టీ ఎం.ఎల్.సి. అభ్యర్థిగా పోతన్ కర్ లక్ష్మి నారాయణ ను బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు లక్ష్మీ నారాయణ పార్టీ ముఖ్య నేతల తో కలిసి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక సంస్థల బలోపేతానికి కృషి చేస్తానని బీజేపీ ఎం.ఎల్.సి. అభ్యర్థి తెలిపారు.
Recommended Video
ఎమ్మెల్సీ బరిలో కాంగ్రెస్ .. రేపు నామినేషన్ వేసే అవకాశం
ఇక కాంగ్రెస్ కూడా తమ అభ్యర్థి పోటీలో ఉంటారని ప్రకటించింది. కాంగ్రెస్ నుండి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి , మానాల మోహన్ రెడ్డి లు టికెట్ రేసులో ఉన్నారు. రేపు నామినేషన్ వెయ్యటానికి చివరి రోజు కావటంతో రేపు కాంగ్రెస్ నుండి నామినేషన్ వేసే అవకాశం ఉంది. ఏది ఏమైనా కవిత రీ ఎంట్రీ ఎలాంటి ఇబ్బంది లేకుండా జరగాలని భావిస్తే బీజేపీ, కాంగ్రెస్ లు బరిలోకి దిగుతుండటం రసవత్తరంగా మారనుంది.