యాక్టీవ్ కానున్న కవితక్క..నిజామాబాద్ మున్సిపల్ బాద్యతలు తనకే..!మళ్ళీ రంగలోకి దిగుతున్న సీఎం తనయ..?!!
Recommended Video
హైదరాబాద్ : తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి చవిచూసి క్రియాశీల రాజకీయాలకు దూరమైన తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు తనయ కల్వకుంట్ల కవిత మళ్లీ రాజకీయాల్లో యాక్టీవ్ కాబోతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఉజ్జయినీ అమ్మవారి బంగారు బోనం సాక్షిగా కవిత మళ్లీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. బోనాల సీజన్ మొదలైంది.. వచ్చేది బతుకమ్మ సీజన్. దానికన్నా కాస్త అటు ఇటుగా మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ పండుగల నేపథ్యంలో కవిత మార్క్ కనిపించకపోతే ఏదో వెల్తీగా ఉంటుంది. అన్నిటి కన్నా మించి తెలంగాణలో పురపాలక ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పార్టీ తరుపున ప్రచారం చేయాలని స్థానిక నేతల నుంచి కవితకు ఒత్తిళ్లు కూడా మొదలైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కవిత మళ్లీ తెలంగాణ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తారనే చర్చ జోరుగా సాగుతోంది.
తెలంగాణ రాజకీయాల్లో వెనకబడ్డ కవిత..! మళ్లీ చురుకైన పాత్ర..!!
తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న కవిత కొన్నాళ్లు నిశ్శబ్దం లోకి వెళ్లారు. మున్సిపల్ ఎన్నికలతో పాటు తెలంగాణ రాష్ట్ర పండుగ సందర్బంగా ఆమె మళ్లీ క్రియా శీల పాత్ర పోషించే అవకాశాలపై చర్చ జరగుతోంది. టీఆర్ఎస్లో మహిళా ప్రాతినిధ్యం తక్కువే అని చెప్పాలి. ఇక మహిళా నాయకురాళ్ళు కాంగ్రెస్ హయంలో వెలిగినంత టీఆర్ఎస్ ప్రభుత్వంలో వెలగలేకపోతున్నారనే చెప్పాలి. టీఆర్ఎస్లో మహిళా నాయకురాళ్ళలో పేరున్న వ్యక్తి అంటే ముందుండేది...తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు కుమార్తె మరియు నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత...గత లోక్ సభ ఎన్నికలలో అనూహ్య ఓటమిని చవి చూసిన ఆమె..ఇప్పుడు పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉన్నట్లు కనిపిస్తుంది. లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయినా...పార్టీ శ్రేణుల్లో మాత్రం కవితకు ప్రత్యేక గుర్తింపు ఉందన్న విషయాన్ని ఎవరూ కాదనలేరు.
శాసన సభ ఎన్నికల్లో ఉత్సాహంగా పని చేసిన కవిత..! నీరు గార్చిన లోక్ సభ ఎన్నికలు..!!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అన్నీ తానై వ్యవహరించిన కవిత...జగిత్యాలలో కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డిని ఓడించడానికి ఎంత కష్టపడిందో అందరికి తెలిసిన విషయమే. ఇక ఆమె లోక్ సభ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి పాలవడంతో టీఆర్ఎస్ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ ఓటమి తర్వాత.. ఆమె జిల్లాకు రావడం లేదు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కూడా ఆమె దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి కూడా కవిత దూరంగా ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
రానున్న మున్సిపల్ ఎన్నికలు..! నిజామాబాద్ బాద్యతలు కవితకే..!!
మున్సిపల్ ఎన్నికలకు కవిత దూరంగా ఉంటే... జిల్లాలో పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపించేదెవరు అనే అంశంలో ఆ పార్టీ నేతలకు కూడా క్లారిటీ రావడం లేదని తెలుస్తోంది. జిల్లా నుంచి వేములు ప్రశాంత్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పటికీ... ఆయన జిల్లా వ్యాప్తంగా తన ప్రభావాన్ని చూపించలేకపోతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఆయన సొంత నియోజకవర్గంలోనూ బీజేపీకి మెజార్టీ రావడం ఆయనకు పెద్ద మైనస్. దీనికి తోడు కవిత తరహాలో రాజకీయ వ్యవహారాలను చక్కబెట్టడం, వ్యూహరచన చేయడంలోనూ ప్రశాంత్ రెడ్డి అంతగా సక్సెస్ కాలేకపోయారనే అపవాదు ఉంది.
మళ్లీ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర..! తన మార్క్ చూపించనున్న కవిత..!!
త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో... కవిత రంగంలోకి దిగితేనే జిల్లా టీఆర్ఎస్లో మళ్లీ మునుపటి జోష్ వస్తుందని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే ఆమె తీరు చూస్తుంటే... ఇప్పుడప్పుడే జిల్లాకు వచ్చి క్రియాశీల రాజకీయాల్లో పాల్గొనే అవకాశాలు కనిపించడం లేదని పలువురు చర్చించుకుంటున్నారు. మొత్తానికి మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఒకవేళ కవిత దూరంగా ఉంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎన్నికలను ముందుండి నడిపించేది ఎవరో చూడాలి.