తెలంగాణలో ఎంపీగా కవిత ఓడింది .. కానీ కవిత గెలిచింది .. టీఆర్ఎస్ కు కొంత రిలీఫ్
Recommended Video
తెలంగాణా రాష్ట్రంలో గులాబీ బాస్ కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత ఓటమి పాలయ్యారు. కానీ మాలోతు కవిత విజయం సాధించారు. కేసీఆర్ తనయ కవితకు నిజామాబాద్ ఓటర్లు షాక్ ఇచ్చారు. మహబూబాబాద్ లోక్ సభ స్థానం నుండి ఎన్నికల బరిలోకి దిగిన మాలోతు కవితకు పట్టం కట్టారు. టీఆర్ఎస్ నుండి పోటీ చేసిన ఇద్దరు కవితల్లో ఒకరు ఆవేదనలో ఉంటె మరొకరు ఆనందంలో ఉన్నారు. ఒకరి ఓటమి టీఆర్ఎస్ నాయకుఅల్ను బాధించినా మరొకరి గెలుపు టీఆర్ఎస్ నాయకులకు కాస్త రిలీఫ్ నిచ్చింది .
కల్వకుంట్ల కవితను ఓడించిన నిజామాబాద్ ప్రజలు
కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవితను ఓటమి పాలు చేశారు నిజామాబాద్ ప్రజలు. గత ఎన్నికల్లో కేసీఆర్ కుమార్తె కవితకు పట్టం కట్టిన ప్రజలు ఈ సారి ఆమెను తిరస్కరించారు. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కు పట్టం కట్టారు. కవిత పై ధర్మపురి అరవింద్ 69 వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. నిజామాబాద్ ఎన్నికల్లో రైతులు పెద్ద సంఖ్యలో బరిలోకి దిగటం కవిత పరాజయానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. రైతులను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వ విధానాలకు నిరసన కవిత ఓటమికి ప్రధాన కారణం అని తెలుస్తుంది.
ఓడినా గెలిచినా తన జీవితం ప్రజాసేవకే అంకితం అంటున్న కేసీఆర్ తనయ కవిత
మాలోతు కవితను గెలిపించిన మానుకోట ఓటర్లు
ఇక మహబూబాబాద్ లోక్ సభ స్థానం నుండి ఎన్నికల బరిలోకి దిగిన మాలోతు కవిత కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన బలరాం నాయక్ పై విజయం సాధించారు . మహబూబాబాద్ లోక్సభ స్థానం నుంచి టీఆర్ఎస్ తరుపున 1,46,562 మెజార్టీతో గెలిచిన మాలోతు కవిత గృహిణి స్థాయి నుంచి కలిసివచ్చిన రిజర్వేషన్లతో రాజకీయ నాయకురాలిగా ఎదిగారు. మరిపెడ మండలం ఉగ్గంపల్లిలో డోర్నకల్ శాసనసభ్యులు, మాజీ మంత్రి డీఎస్.రెడ్యానాయక్ కుమార్తె మాలోతు కవిత . మానుకోటలో విజయం సాధించటంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.
ఒక కవిత ఎంపీగా ఓడినా మరో కవిత గెలిచింది
టీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసిన కవితల్లో ఒకరు లోక్ సభలో అడుగు పెట్టబోతున్నారు. గతంలో లోక్ సభలో తెలంగాణా గళాన్ని వినిపించిన కల్వకుంట్ల కవిత స్థానంలో ఈసారి మాలోతు కవిత తన గళాన్ని వినిపించబోతున్నారు. మొత్తానికి ఇప్పుడు టీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక కవిత ఓటమి పాలైనా మరో కవిత విజయం టీఆర్ఎస్ పార్టీలో చర్చకు కారణం అవుతుంది.