నిజామాబాద్ లో కేసీఆర్ తనయ కవిత ఓటమి .. కారణాలు ఇవేనా ?
గులాబీ బాస్ కేసీఆర్ కు నిజామాబాద్ ఓటర్లు షాక్ ఇచ్చారు. కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవితను ఓటమి పాలు చేశారు. ఈ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ విజయం సాధించారు. నిజామాబాద్ ఎన్నికల్లో రైతులు పెద్ద సంఖ్యలో బరిలోకి దిగటం కవిత పరాజయానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది.
పార్లమెంట్ ఎన్నికల్లో పుంజుకున్నకాంగ్రెస్..! అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమీకి కారణం చంద్రబాబేనా...?
టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇస్తూ కేసీఆర్ కుమార్తె కవిత ఓటమి
నిజామాబాద్ ఎన్నికల తొలిరోజు నుండే సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఫలితాల విషయంలో కూడా సంచలనం సృష్టించింది. బీజేపీ అసలు ఊహించని విధంగా నిజామాబాద్ లో విజయం సాధించింది. టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇస్తూ కేసీఆర్ కుమార్తెను ఓటమి పాలు చేసింది. టీఆర్ ఎస్ అనుకున్నది ఒకటైతే అయ్యింది మాత్రం ఒకటి. రైతుల సమస్యలను గాలికొదిలేసిందన్న ఆగ్రహమో , ఎలాగైనా తామే విజయం సాధిస్తామన్న టీఆర్ఎస్ ఓవర్ కాన్ఫిడెన్స్ నో తెలీదు కానీ కవిత ఓటమి పాలయ్యింది . కవిత పై ధర్మపురి అరవింద్ 69 వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు.
రైతుల పోరాటమే కవితకు దెబ్బ కొట్టింది
నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల్లో పసుపు రైతులు 176 మంది పోటీలో నిలవడంతో రాష్ట్రంలోనే కాదు.. దేశమంతటా అది హాట్ టాపిక్ అయింది. ఇక ఎన్నికలు ఎక్కడా జరగని విధంగా జరిగాయి. కవితపై పోటీ చేసి తమ నిరసన తెలియజేసిన రైతులు కేవలం తమ డిమాండ్ల సాధన కోసమే ఎన్నికల బరిలోకి దిగారు. అయినా స్థానిక పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న నిజామాబాద్ ప్రజలు మాత్రం అక్కడ సంచలన తీర్పు ఇచ్చారు. కేసీఆర్ కు పెద్ద షాక్ ఇచ్చారు .
అసెంబ్లీ ఎన్నికల్లో ఆదరించిన వారే లోక్ సభ ఎన్నికల్లో ఓడించారు
అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు స్పష్టమైన తీర్పునిచ్చిన నిజామాబాద్ జిల్లా ఓటర్లు...లోక్ సభకు వచ్చేసరికి తీర్పును దానిని సవరించారు. నిజామాబాద్ లో టీఆర్ఎస్ ఓటమికి పలు కారణాలున్నాయంటున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా రైతుల ఎఫెక్ట్ టీఆర్ ఎస్ పై దెబ్బ కొట్టింది అని చెప్పొచ్చు . నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డుతో సహా, పసుసు, ఎర్రజొన్నలకు గిట్టుబాటు ధరపై గతేడాది చివర్లో రైతులు పోరుబాట పట్టారు. నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గ రైతులు కొన్ని నెలలపాటు ఆందోళన చేశారు. తమ సమస్యలన్నీ దేశానికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో మూకుమ్మడిగా నిజామాబాద్ బరిలో నిలిచారు.
టీఆర్ఎస్ ఓవర్ కాన్ఫిడెన్స్ , రైతుల పోరాటం కవిత కొంప ముంచాయి
పసుపు బోర్డు అంశం రాష్ట్ర పరిధిలోనిది కాకపోయినా గిట్టుబాటు ధరపై రైతులతో రాష్ట్ర ప్రభుత్వం తరపున మాట్లాడింది లేదు. వారికి ఎలాంటి భరోసా ఇచ్చింది లేదు. ఎవరు పోటీ చేసిన గెలుపు తమదేనన్న ధీమాతో..రైతుల్ని టీఆర్ఎస్ పట్టించుకోలేదన్న వాదనలున్నాయి. ఈ అంశాన్ని బీజేపీ వాడుకుంది . బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్..పక్కా ప్లాన్ తో ముందుకెళ్లారు. ముందు నుండీ క్షేత్ర స్థాయిలో పని చేశారు అరవింద్ . కేంద్ర నాయకులతో నిజామాబాద్ లో సభలు పెట్టించారు. అవి బాగానే వర్కవుట్ అయినట్టు ఫలితాలతో తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ కూడా బీజేపీకే మద్దతిచ్చినట్టు లోకల్ గా చెప్పుకుంటున్నారు. ఓవరాల్ గా చూస్తే నిజామాబాద్ ఓటమి కవితది కాదు...కేసీఆర్ దేనని చెప్తున్నారు విశ్లేషకులు.