షబ్బీర్ అలీకి మదన్ మోహన్ చెక్..? జిల్లాలో తగ్గుతోన్న మైనార్టీ నేత ప్రభ..
టీ పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ సాగర్ బై పోల్ వరకు వాయిదా పడిన సంగతి తెలిసిందే. టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా షబ్బీర్ అలీ పేరు కూడా వినిపించింది. అయితే అదీ కన్ఫామ్ కావాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే. ఇంతలో షబ్బీర్ అలీకి సొంత నియోజకవర్గంలో షాక్ తగిలింది. తన కుమారుడికి కూడా జిల్లా అధ్యక్ష పదవీ ఇప్పించుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం మదన్ మోహన్ అని అంటున్నారు. ఇంతకీ షబ్బీర్ అలీకి మదన్ మోహన్ చెక్ పెడతారా..? కామారెడ్డిలో వాస్తవ పరిస్థితి ఏంటీ..?
కీలకంగా షబ్బీర్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయాల్లో షబ్బీర్ అలీ ఓ వెలుగు వెలిగారు. యువజన కాంగ్రెస్ నేతగా రాజకీయ అరంగేట్రం చేసి.. అంచలంచెలుగా ఎదిగారు. చిన్న వయసులో కామారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడమే గాక మంత్రి పదవీని చేపట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో కీలకమైన విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. 2014, 2018 ఎన్నికల్లో తక్కువ ఓట్లతో ఓడిపోయారు. మండలి ప్రతిపక్ష నేతగా పనిచేశారు. ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి షబ్బీర్ అలీ పెద్ద దిక్కుగా మారారు. జిల్లా వ్యవహారాలన్నీ ఆయన కనుసన్నల్లోనే జరుగుతాయి.
ఢిల్లీ స్థాయిలో గుర్తింపు
రాష్ట్రంలో మైనారిటీ నేత అయిన షబ్బీర్ అలీకి ఢిల్లీ స్థాయిలో గుర్తింపు ఉంది. ఈ పలుకుబడి వల్ల కామారెడ్డి జిల్లాలో ఏలుబడి సాగిస్తున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా పోటీచేసిన మదన్ మోహన్ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరిన ఆయనకు ఎంపీ టికెట్ ఇప్పించడంలో షబ్బీర్ అలీ కీలకంగా పనిచేశారు. తొలిరోజుల్లో చేయీ చేయీ కలిపి తిరిగిన ఇద్దరు నేతలు ఎంపీ ఎన్నికల తర్వాత ఎడమొహం పెడమొహంగా మారారు. పార్లమెంట్ ఎన్నికల్లో షబ్బీర్ అలీతో పాటు ఆయన అనుచరులు తనకు పూర్తి స్థాయిలో సహకరించలేదని మదన్ భావించినట్టు తెలుస్తోంది.
బెడిసిన సంబంధాలు
బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో అంతంతమాత్రంగా పనిచేశారని మదన్ మోహన్ గుర్తించారు. పలు సందర్భాల్లో ఈ విషయాన్ని పార్టీ ముఖ్యనేతల ముందు చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మదన్ మోహన్కు షబ్బీర్ అలీకి సంబంధాలు బెడిసికొట్టాయి. ఇరువురి మధ్య అంతరం పెరుగుతూ వస్తోంది. మదన్ మోహన్ సొంతగా బలపడే ప్రయత్నాలు ప్రారంభించినట్టు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ రాజకీయాలను శాసిస్తున్న షబ్బీర్ అలీకి ప్రస్తుతం మదన్ మోహన్ చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ జరుగుతుంది.
మదన్ వెంట యువనేతలు
మదన్ మోహన్ తనకు ప్రత్యేక వర్గాన్ని పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారని తెలుస్తోంది. కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది. చాలామంది సీనియర్లు, షబ్బీర్ అలీ ప్రధాన అనుచరుల్లో కొందరు గత ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిపోయారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ను దెబ్బతీసిందని వర్గమే అనే ఆరోపణలు ఉన్నాయి. షబ్బీర్ అలీతో ఇమడలేకే వారు కాంగ్రెస్కు ఖటీఫ్ చెప్పారనే ప్రచారంలో ఉంది. మదన్ మోహన్ లాంటి అసంతృప్తులు, పార్టీ మారిన సీనియర్లపై దృష్టి పెట్టారు. పార్టీలో ఉన్న నియోజకవర్గ స్థాయి నేతలను చేరదీస్తున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో యువ నేతలు ప్రస్తుతం మదన్ వెంట తిరుగుతున్నారు.
మదన్ వర్గంలో వీరే..
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ముఖ్య నేతలు కొందరు మదన్ మోహన్ గ్రూపులో చేరిపోయారని తెలుస్తోంది. మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు జమున రాథోడ్, కొందరు ద్వితీయ శ్రేణి నేతలు, జుక్కల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గంగారాం మదన్ వర్గంలో ఉన్నట్టు సమాచారం. బాన్సువాడలో ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ నేత ఒకరు మదన్కు ప్రధాన అనుచరుడిగా మారిపోయారని చెబుతారు. అప్పట్లో తన టికెట్కు షబ్బీర్ అడ్డుపడ్డారనే కోపంతో ఆయన మదన్కు అండగా నిలిచారని చెబుతారు. సీనియర్లతోపాటు ప్రధానంగా యువతను చేరదీస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ అధ్యక్షుడిగా ఉన్న మదన్ మోహన్ యువతరాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
గజానన్ పటేల్ విజయం
ఇటీవల జరిగిన జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికల్లో మదన్ మోహన్ వర్గీయుడు గజానన్ పటేల్ విజయం సాధించారు. జుక్కల్ నియోజకవర్గానికి చెందిన గజానన్ పటేల్ ఏకంగా షబ్బీర్ అలీ తనయుడు ఇలియాస్ను ఓడించారు. షబ్బీర్ అలీ తన కుమారుడు ఇలియాస్ను జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేయాలని నిర్ణయించారు. ఏకగ్రీవంగా జరిగే ఎంపికకు ఇలియాస్ పేరు ప్రతిపాదిస్తూ పార్టీ హైకమాండ్కు సమాచారం పంపారు. నిర్ణయాన్ని మదన్ మోహన్ వ్యతిరేకించారు. మరికొందరు పోటీదారులు ఉన్నారని, ఎన్నిక నిర్వహించాలని పట్టుబట్టారు. దాంతో ఆన్లైన్లో పోలింగ్ నిర్వహించారు.
582 ఓట్లతో విజయం
ఎన్నికలో గజానన్ పటేల్కు 4702 ఓట్లు రాగా, ఇలియాస్కు 4120 ఓట్లు పడ్డాయి. 582 ఓట్ల మెజారిటీతో గజానన్ విజయం సాధించారు. దాంతో షబ్బీర్ అలీ ఆధిపత్యానికి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. కుమారుడిని గెలిపించుకోలేని పరిస్థితి ఏర్పడిందనే చర్చ పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. మదన్ మోహన్ పట్టుబట్టి మరీ షబ్బీర్ అలీ కుమారుడిని ఓడించాలని గట్టిగా శ్రమించారని చెబుతారు. ఈ విజయంతో ఆయన షబ్బీర్కు కౌంటర్ ఇచ్చారు.