కన్నెర్ర చేస్తున్న పసుపు, ఎర్రజొన్న రైతులు... లోక్ సభ ఎన్నికలను అడ్డుకునే వ్యూహం
గిట్టుబాటు ధర కోసం పసుపు, ఎర్రజొన్న రైతులు కన్నెర్ర చేస్తున్నారు. మద్దతు ధర కోసం ఆర్మూర్ రైతులు వరుస ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. మొన్నటికి మొన్నపోలీసుల ఆంక్షలను లెక్కచేయకుండా వందలాది సంఖ్యలో మామిడి పల్లి చౌరస్తాలో మహాధర్నా చేపట్టిన రైతులు సుమారు 4 గంటల పాటు ధర్నా చేసి.. జాతీయ రహదారి దిగ్బంధించారు. రోడ్ల పైనే నిద్రించారు. వంట వార్పూ కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వం దిగొచ్చేదాక ఆందోళనను ఉధృతం చేయాలని నిర్ణయించారు ఆర్మూరు రైతులు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే లోక్సభ ఎన్నికలను అడ్డుకోవాలని నిర్ణయించుకున్న రైతులు వేల సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయాలని తీర్మానించారు.
మద్దతు ధర కల్పించి మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని ఆర్మూరు రైతుల డిమాండ్
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో పసుపు- ఎర్రజొన్న రైతులు మద్దతు ధర కోసం మరోసారి ఉద్యమించారు. గత సంవత్సరం కూడా గిట్టుబాటు ధర కోసం ఉదృతమైన ఆందోళన చేసి గిట్టుబాటు ధర సాధించుకున్న ఆర్మూరు రైతులు ఈసారి కూడా పసుపు, ఎర్ర జొన్నలకు బైబ్యాక్ ఒప్పందం ప్రకారం గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్మూరు రైతులు పట్టిన పట్టు విడవకుండా అందరూ ఏకతాటి మీదకు వచ్చి ఆందోళనలకు దిగి అనుకున్నది సాధిస్తారు. ఇక ఈ నేపథ్యంలో రైతుల ఆందోళనకు అనుమతి లేదంటూ పోలీసులు ప్రకటన చేసి.. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా 144 సెక్షన్ విధించినప్పటికీ.. మొన్నటికి మొన్న రైతులు మామిడిపల్లి చౌరస్తాకు చేరుకుని.. మహాధర్నా చేపట్టారు. ఇక తాజాగా ఆర్మూర్ కేంద్రంలో మహా ధర్నా చేపట్టిన పసుపు ఎర్రజొన్న రైతులు పసుపు ధర 15000, ఎర్రజొన్న ధర 3500 మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.వందల సంఖ్యలో తరలొచ్చిన రైతులు.. జై కిసాన్ -జై జవాన్ నినాదాలతో హోరెత్తించారు. రైతు లేనిదే రాజ్యం లేదంటూ నినాదాలు చేస్తూ.. రైతులు సాగించే ఆందోళనలో పార్టీలకు కండువాలకు తావులేదని తెలియజేశారు.
ఫిబ్రవరి 4 నుండి వివిధ రూపాల్లో రైతుల ఉధృత ఆందోళన
ఫిబ్రవరి 4న మోర్తాడ్ లో నిర్వహించిన రైతు ఆవేదన సభలో కార్యాచరణ రూపొందించుకున్న రైతులు నాటినుండి నేటి వరకు గిట్టుబాటు ధర కోసం ఉద్యమిస్తూనే ఉన్నారు.నేడు మరోమారు ఆర్మూరు లో మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించారు.ఫిబ్రవరి 7న ఆర్మూర్లో ధర్నా నిర్వహించిన రైతులు, 12న మరోసారి భారీర్యాలీ, ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. 16న ఆర్మూర్, జక్రాన్పల్లిల్లో జాతీయ రహదారిపై వంటా వార్పు జరిపారు. రోడ్ల పైనే నిద్రించారు.మహిళలు కూడా అర్ధరాత్రి దాకా ఆందోళనల్లో పాల్గొన్నారు. 18న కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. రైతులు సాగిస్తున్న ఉద్యమాన్ని అణిచివేసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా రైతులపై కేసులు నమోదు చేశారు. అయినప్పటికీ వెనక్కితగ్గని రైతులు నేడు మరో మారు ఆర్మూర్లోని మామిడిపల్లి చౌరస్తాలో మహాధర్నాకు పిలుపునిచ్చారు.
గిట్టుబాటు ధర కల్పించకుంటే లోక్ సభ ఎన్నికలను అడ్డుకునే వ్యూహం
తమ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని రైతులు ప్రకటించారు. ఒకవేళ ఈ మహాధర్నాతో ప్రభుత్వం దిగిరాకపోతే లోక్సభ ఎన్నికలను అడ్డుకునేందుకు పసుపు ఎర్రజొన్న రైతులు ప్లాన్ చేస్తున్నారు. నిజామాబాద్ లోక్ సభ స్థానానికి వేల సంఖ్యలో నామినేషన్లు వేసి తమ నిరసన తెలియజేయాలని నిర్ణయించారు. 2014 ఎన్నికల సమయంలో కూడా ఇదే తరహా వ్యూహాన్ని అమలు చేసిన రైతులు అప్పట్లో 27 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అందులో పది మంది నామినేషన్లు తిరస్కరణకు గురి కాగా 17 మంది రైతులు ఎన్నికల బరిలో నిలిచారు. అయితే అప్పుడు ఎన్నికల మీద అదంత ప్రభావం చూపించలేకపోయింది. కానీ ఈ సారి ఎన్నికను అడ్డుకునే విధంగా వేల సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయాలని తీర్మానించారు. ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించే వరకు పోరాటం సాగిస్తామని ఆర్మూరు రైతులు తేల్చి చెబుతున్నారు. తమ డిమాండ్ పరిష్కరించకుంటే ఎంతవరకైనా వెళ్లే ఆర్మూరు రైతుల ఆందోళన ప్రస్తుతం ప్రభుత్వాన్ని టెన్షన్ పెడుతోంది. రైతు ఉద్యమాన్ని అణచటానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది.