స్నేహితులతో ఛాలెంజ్.. ఫుల్ బాటిల్ గటగటా తాగి.. ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి..
వాళ్లంతా స్నేహితులు.. అంతా కలిసి మందు పార్టీ చేసుకున్నారు. రెండు, మూడు పెగ్గులు తాగాక అందులో ఓ వ్యక్తి కాస్త తూలడం మొదలుపెట్టాడు. దీంతో అప్పుడే ఎక్కిందా అంటూ అతని స్నేహితులు హేళన చేశారు. దాన్ని అవమానంగా భావించిన అతడు.. తాగడంలో తన స్టామినా ఏంటో చూపించాలనుకున్నాడు. అప్పటికప్పుడు మరో ఫుల్ బాటిల్ తెప్పించాడు. అరగంటలో ఫుల్ బాటిల్ ఖాళీ చేస్తానని స్నేహితులతో ఛాలెంజ్ చేశాడు. చెప్పినట్టుగానే బాటిల్ మూత తీసి గటగటా తాగడం మొదలుపెట్టాడు. కానీ అదే అతని ప్రాణాల మీదకు తెచ్చింది. ఎక్కువ మోతాదులో మద్యం సేవించడంతో అపస్మారక స్థితిలోకి చేరుకుని బ్రెయిన్ డెడ్ అయి చనిపోయాడు.
వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా ధర్పల్లిలోని గోసింగి కాలనీకి చెందిన కడమంచి కాశయ్య(35) పాత సామాన్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం రాత్రి కాశయ్య ఇంట్లో.. అతడు,అతని స్నేహితులు కలిసి మందు పార్టీ చేసుకున్నారు. కాసేపటికే కాశయ్య కాస్త తూలినట్టు అనిపించడంతో.. అప్పుడే ఎక్కిందా అంటూ అతని స్నేహితులు గట్టిగా నవ్వారు. దీంతో అవమానంగా భావించిన కాశయ్య.. అప్పటికప్పుడు మరో ఫుల్ బాటిల్ తెప్పించాడు.
అరగంటలో తానొక్కడినే బాటిల్ ఖాళీ చేస్తానని ఛాలెంజ్ చేశాడు. చెప్పినట్టుగానే బాటిల్ మూత తీసి గటగటా తాగేశాడు. ఆ తర్వాత స్నేహితులంతా వెళ్లిపోగా.. కాశయ్య మత్తులోకి జారుకున్నాడు. శుక్రవారం ఉదయం కాశయ్య భార్య అతన్ని నిద్ర లేపేందుకు ప్రయత్నించగా ఎలాంటి ఉలుకు పలుకు లేదు. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు నిర్దారించారు. అతిగా మద్యం సేవించడం వల్లే బ్రెయిన్ డెడ్ అయి చనిపోయినట్టు భావిస్తున్నారు. కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. రెక్కాడితే గానీ డొక్కాడని బతుకుల్లో ఇంటి పెద్దను కోల్పోవడం ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది.