ఒళ్లు గగుర్పొడిచేలా.. భర్తను కిరాతకంగా చంపిన భార్య... ప్రియుడితో వివాహేతర సంబంధమే కారణం..
నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి ఓ వివాహిత భర్తను కిరాతకంగా హతమార్చింది. మెడకు తాడు బిగించి హత్య చేసిన అనంతరం అతని శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా కోసేందుకు యత్నించారు. ఆపై అతని ముఖాన్ని గుర్తుపట్టరాకుండా చేసేందుకు కిరోసిన్తో కాల్చివేశారు. ఇంతా చేసి ఏమీ తెలియనట్లు సదరు వివాహిత తన భర్త కనిపించట్లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల దర్యాప్తులో ఎట్టకేలకు అసలు నిజం బయటపడింది.
అసలేం జరిగింది...
నిజామాబాద్ జిల్లా మోర్తాడ్కు చెందిన అబ్దుల్ సమద్ పైసల్ స్థానికంగా పెయింటర్గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య యాస్మిన్ బేగం,పిల్లలు ఉన్నారు. యాస్మిన్ కూడా ఇంటి వద్ద బీడీలు చుడుతూ భర్తకు చేదోడు వాదోడుగా ఉంటోంది. ఈ క్రమంలో స్థానిక ఆటోడ్రైవర్ మహ్మద్ అథాఉల్లాల్తో యాస్మిన్ బేగంకు పరిచయం ఏర్పడి అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. కొన్నాళ్లకు విషయం ఆమె భర్త పైసల్కు తెలిసింది. దీంతో పద్ధతి మార్చుకోవాలని అతను భార్య యాస్మిన్ను హెచ్చరించాడు. స్థానిక కమిటీ పెద్దలకు కూడా ఫిర్యాదు చేశాడు. కమిటీ పెద్దలు కూడా మహ్మాద్ అథాఉల్లాను మందలించి యాస్మిన్కు దూరంగా ఉండాలని హెచ్చరించారు. అయినప్పటికీ యాస్మిన్-అథఉల్లాల్ వివాహేతర సంబంధాన్ని వదులుకోలేకపోయారు.
ప్రియుడితో కలిసి హత్య...
ఈ నేపథ్యంలో తమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని యాస్మిన్ భావించింది. ఇందుకోసం ప్రియుడు అథాఉల్లాల్తో కలిసి హత్యకు స్కెచ్ వేసింది. గతేడాది డిసెంబర్ 16 రాత్రి ప్రియుడిని ఇంటికి పిలిపించింది. నిద్రపోతున్న పైసల్పై అథఉల్లాల్ కర్రతో బలంగా దాడి చేశాడు. దీంతో పైసల్ స్పృహ కోల్పోయాడు. అనంతరం యాస్మిన్,అథఉల్లాల్ కలిసి అతని మెడకు ఉరి బిగించి హత్య చేశారు.
మృతదేహాన్ని ముక్కలుగా కోసే యత్నం..
హత్య చేసిన మరుసటిరోజు శవాన్ని ఇంట్లోనే ఉంచారు. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కోసి సంచుల్లో తీసుకెళ్లి ఎక్కడైనా పడేయాలనుకున్నారు. మొదట కాలును తొలగించి ముక్కలు ముక్కలు చేశారు. అయితే మొత్తం శరీరాన్ని ముక్కలు చేయడం ఆలస్యమవుతుందని భావించి ప్లాన్ మార్చుకున్నారు. ముఖం గుర్తుపట్టరాకుండా కిరోసిన్తో కాల్చివేశారు. అనంతరం మృతదేహాన్ని దుప్పట్లు,సంచుల్లో చుట్టి డిసెంబర్ 18న నిర్మల్ జిల్లాలోని బూరుగుపల్లి అటవీ ప్రాంతంలో పడేశారు.
ఏమీ ఎరగనట్టు పోలీసులకు ఫిర్యాదు...
ఆ తర్వాత తనకేమీ తెలియనట్లు భార్య యాస్మిన్ మోర్తాడ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి తన భర్త పైసల్ కనిపించట్లేదని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా.. బూరుగుపల్లి వద్ద వారికి గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. దీనిపై యాస్మిన్కు సమాచారమిచ్చి ఆమెను పిలిపించారు. అయితే అది తన భర్త మృతదేహం కాదని యాస్మిన్ చెప్పింది. అనుమానం వచ్చిన పోలీసులు పైసల్ అక్కడ,స్నేహితులను పిలిపించి శవానికి సంబంధించిన ఆనవాళ్లు చూపించారు. అది పైసల్ మృతదేహమే అని వారు గుర్తించారు.
ఎట్టకేలకు బయటపడ్డ నిజం..
అనుమానం వచ్చిన పోలీసులు యాస్మిన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు నిజం బయటపెట్టింది. ప్రియుడు అథఉల్లాల్తో కలిసి భర్తను హత్య చేసినట్లు నేరం అంగీకరించింది. దీంతో అథఉల్లాల్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఇద్దరినీ రిమాండుకు తరలించారు. హత్య చేసేందుకు వాడిన ఆటో, కత్తి, సెల్ఫోన్లు, తాడు,ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.