నిజామాబాద్ రైతన్నల పోరాటం.. హైదరాబాద్ పాదయాత్రకు అడ్డంకులు
నిజామాబాద్ : మద్దతు ధర ఇవ్వాలంటూ అన్నదాతలు రోడ్డెక్కారు. పలుమార్లు ఆందోళనకు దిగినా అటు పాలకులు గానీ, అధికారులు గానీ స్పందించలేదు. జాతీయ రహదారిపై బైఠాయించినా.. ప్రభుత్వం నుంచి సరైన హామీ లభించలేదు. దీంతో ఛలో హైదరాబాద్ పాదయాత్రకు సిద్ధమయ్యారు రైతన్నలు. కానీ పోలీసులు అడుగడుగునా అడ్డుకోవడంతో నిరసన కార్యక్రమం విఫలమైనట్లైంది.
రైతన్న పోరాటం
నిజామాబాద్ జిల్లా రైతన్నలు గత కొద్దిరోజులుగా నిరసనలకు దిగుతున్నారు. పసుపు, ఎర్రజొన్నకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టారు. ఆ క్రమంలో గత 20 రోజులుగా నాలుగుసార్లు జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు. సోమవారం నాడు సైతం పెద్దసంఖ్యలో నేషనల్ హైవేపై బైఠాయించినా.. పాలకుల నుంచి స్పందన కరువైంది. దాంతో మంగళవారం నాడు ఛలో హైదరాబాద్ పాదయాత్ర తలపెట్టారు. అందరూ ఒక్కచోట చేరి పాదయాత్రకు సిద్ధమవుదామని డిసైడయ్యారు.
ఛలో హైదరాబాద్.. పాదయాత్ర
తమ గోస ప్రభుత్వానికి వినపడేలా, కనపడేలా ఛలో హైదరాబాద్ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు జిల్లా రైతులు. ఆ క్రమంలో మంగళవారం నాడు పాదయాత్ర ప్రారంభించారు. ఆర్మూర్ మండలం మామిడిపల్లి శివారు నుంచి తలపెట్టిన ఈ నిరసన కార్యక్రమానికి పోలీసులు అడుగడుగునా అడ్డుపడ్డారు. ముందుగానే మామిడిపల్లికి చేరుకున్న పోలీస్ బలగాలు రైతన్నలను కట్టడి చేశాయి. అన్నదాతలను ఎక్కడికక్కడ అడ్డుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు.
అడ్డుకున్న పోలీసులు.. సికింద్రాబాద్ శివారులో సైతం
మామిడిపల్లి శివారులో కొంతమంది రైతులను పోలీసులు అడ్డుకున్న దరిమిలా.. రూట్ మార్చారు మరికొందరు. జక్రాన్ పల్లి నుంచి కొందరు రైతులు పాదయాత్రగా బయలుదేరారు. అయితే ఆలస్యంగా సమాచారం అందుకున్న నిజామాబాద్ సీపీ.. పోలీస్ సిబ్బందితో వారిని వెంబడించారు. అప్పటికే రైతులు సికింద్రాబాద్ శివారు ప్రాంతానికి చేరుకున్నారు.
పాదయాత్రకు అనుమతి లేదని చెబుతూ విరమించుకోవాలని సూచించారు సీపీ. కానీ వారు ససేమిరా అనడంతో అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసులు, రైతులకు చిన్నపాటి వాగ్వాదం జరిగింది. కొంతమందిని అదుపులోకి తీసుకోగా.. మరికొందరికి నచ్చజెప్పి వెనక్కి పంపించారు.