కవిత సుధీర్ఘ నిరీక్షణకు తెర: నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ రిలీజ్, 9న ఓటింగ్..
హమ్మయ్య.. ఎట్టకేలకు నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలయ్యింది. వచ్చేనెల 9వ తేదీన ఎన్నిక నిర్వహిస్తామని ఎన్నికల కమిషన్ తెలిపింది. అదే నెల 12వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడుతామని పేర్కొన్నది. దీంతో 8 నెలల నుంచి వాయిదాపడుతూ వస్తోన్న ఎన్నికను ఈసీ నిర్వహించనుంది. ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కావడంతో ఇదివరకే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు.

ఎమ్మెల్సీగా ఉండి.. పోటీ...
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా 2015 డిసెంబర్లో డాక్టర్ భూపతిరెడ్డి ఎన్నికయ్యారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి టికెట్ రాలేదు. దీంతో కాంగ్రెస్ టికెట్పై నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆయన ఓడిపోయినప్పటికీ.. పార్టీ నిబంధనలు ఉల్లంఘించి పోటీ చేసినందుకు టీఆర్ఎస్ నేతలు ఇచ్చిన మండలి చైర్మన్కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో చైర్మన్ భూపతిరెడ్డిని జనవరి 16, 2019న డిస్క్వాలీఫై చేశారు. అప్పటి నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఖాళీగా ఉంది.

బరిలో వీరే..
ఉమ్మడి జిల్లా పరిధిలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఎంపీటీసీలు, జడ్పీటీ సీలు, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఓటు హక్కును కలిగి ఉన్నారు. వీరే స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీని ఎన్నుకోనున్నారు. ఉప ఎన్నికకు టీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ నుంచి సుభాష్రెడ్డి, బీజేపీ నుంచి లక్ష్మీనారాయణ బరిలో ఉన్నారు.

ఏడుగురు నామినేషన్ వేసినా..
మొత్తం ఏడుగురు అభ్యర్థులు నామినేషన్లు వేయగా.. ఇద్దరు అభ్యర్థులు శ్రీనివాస్, భాస్కర్ నామినేషన్లను పరిశీలన సమయంలోనే అధికారులు తిరస్కరించారు. లోయపల్లి నర్సింగ్రావు, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి నామినేషన్లు విత్ డ్రా చేసుకున్నారు. దీంతో ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉన్నారు. కానీ ఎన్నిక మాత్రం వాయిదా పడుతూ వచ్చింది.

వాయిదాల పర్వం...
ఏప్రిల్ 7న జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్.. లాక్డౌన్ వల్ల వాయిదా పడింది. అభ్యర్థుల నామినేషన్లు, పరిశీలన, ఉప సంహరణ ప్రక్రియ అన్నీ ముగిశాయి. ఆ లోపే దేశంలో కరోనా వైరస్ విజృంభించడంతో భారత ఎన్నికల సంఘం ఎన్నికలను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంది. తొలుత మే 22 వరకు.. తర్వాత 45 రోజుల పాటు వాయిదా వేసింది. జూలై 7 వరకు గడువు ఇచ్చింది. తర్వాత కూడా వాయిదా పడుతూ మరీ వచ్చింది. కానీ ఎట్టకేలకు బీహర్ ఎన్నికలతోపాటు షెడ్యూల్ ప్రకటించింది. దీంతో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు తమ ప్రచార పర్వాన్ని ప్రారంభించే అవకాశం ఉంది.