నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక: 824 మంది ఓటర్లు, 24 మందికి కరోనా.. కొనసాగుతోన్న పోలింగ్..
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రారంభమైంది. ఉదయం 9 గంటలకు మొదలైన పోలింగ్.. సాయంత్రం 5 వరకు కొనసాగనుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 50 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జరుగుతోంది. అధికంగా నిజామాబాద్ కార్పోరేషన్లో 67 మంది, చందూర్లో తక్కువగా నలుగురు ఓటు హక్కు వినియోగించుకుంటారు. పోలింగ్ ఇవాళ జరగగా.. ఈ నెల 12వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టి.. అదేరోజు ఫలితం ప్రకటిస్తారు.
824 మంది ఓటర్లు..
మొత్తం 824 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటారు. 483 మంది నిజామాబాద్ జిల్లా ఓటర్లు కాగా, 341 మంది కామారెడ్డి జిల్లా ఓటర్లు ఉన్నారు. పోలింగ్ స్టేషన్లలో వెబ్ క్యాస్టింగ్, సమస్యాత్మకంగా గుర్తించిన 14 స్టేషన్లలో వీడియో షూటింగ్తోపాటు వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఓటర్లకు టెంపరేచర్ టెస్ట్, మాస్కు, గ్లౌజులు తప్పనిసరి చేశారు.
24 మందికి కరోనా
మొత్తం ఓటర్లలో 24 మంది ఓటర్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ జరిగింది దీంతో వారికి చివరి గంటలో ఓటు వేసే అవకాశం కల్పించారు. కరోనా బాధితుల కోసం పీపీఈ కిట్లు, అంబులెన్స్లను అధికారులు సమకూర్చారు. ఎన్నికల విధుల్లో 399 మంది పాల్గొన్నారు. బాన్సువాడలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఓటు వినియోగించుకుంటారు. భీంగల్లో మంత్రి ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ జడ్పీ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్దన్, జీవన్ రెడ్డి, ఎంపీ అరవింద్, ఎమ్మెల్సీలు ఆకుల లలిత, వీజీ గౌడ్, రాజేశ్వర్ తమ ఓటు వేస్తారు.
అనర్హత వేటు
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా 2015 డిసెంబర్లో డాక్టర్ భూపతిరెడ్డి ఎన్నికయ్యారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి టికెట్ రాలేదు. దీంతో కాంగ్రెస్ టికెట్పై నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆయన ఓడిపోయినప్పటికీ.. పార్టీ నిబంధనలు ఉల్లంఘించి పోటీ చేసినందుకు టీఆర్ఎస్ నేతలు ఇచ్చిన మండలి చైర్మన్కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో చైర్మన్ భూపతిరెడ్డిని జనవరి 16, 2019న డిస్క్వాలీఫై చేశారు. అప్పటి నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఖాళీగా ఉంది.
Recommended Video
బరిలో వీరే..
ఉప ఎన్నికకు టీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ నుంచి సుభాష్రెడ్డి, బీజేపీ నుంచి లక్ష్మీనారాయణ బరిలో ఉన్నారు. మొత్తం ఏడుగురు అభ్యర్థులు నామినేషన్లు వేయగా.. ఇద్దరు అభ్యర్థులు శ్రీనివాస్, భాస్కర్ నామినేషన్లను పరిశీలన సమయంలోనే అధికారులు తిరస్కరించారు. లోయపల్లి నర్సింగ్రావు, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి నామినేషన్లు విత్ డ్రా చేసుకున్నారు. దీంతో ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉన్నారు.