కరోనా ఎఫెక్ట్: కవితకు నిరీక్షణ తప్పదు.. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మళ్లీ వాయిదా..
లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయిన సీఎం కేసీఆర్ తనయ కవిత.. ఎమ్మెల్సీగా తిరిగి చట్టసభలో అడుగుపెట్టేందుకు మరికొంత కాలం వేచి ఉండక తప్పేలా లేదు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటులో గెలుపు కోసం అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఏర్పాట్లు చేసుకోగా.. ఎన్నిక మరోసారి వాయిదా పడింది. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మే 7న జరగాల్సిన ఉపఎన్నిక కరోనా లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే ఓసారి వాయిదా పడగా, గతంలో పొడిగించిన గడువు ముగుస్తుండడంతో భారత ఎన్నికల సంఘం ఈసారి ప్రక్రియను 45 రోజులకు పొడిగించింది.
నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక రావడంతో మార్చి 12న నోటిఫికేషన్ జారీ చేశారు. మే 7న ఎన్నికలు జరుగుతాయంటూ షెడ్యూల్ లో పేర్కొన్నారు. అయితే కరోనా కారణంగా లాక్ డౌన్ ప్రకటించడంతో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాలేదు. లాక్ డౌన్ మళ్లీ పొడగించిన నేపథ్యంలో ఈసీ మరోసారి నిజామాబాద్ ఎన్నికను వాయిదా వేసింది. అయితే, పక్కరాష్ట్రం మహారాష్ట్రలో ఎమ్మెల్సీ ఎన్నిక ద్వారా సీఎం ఉద్ధవ్ తన పదవిని కాపాడుకున్న సంగతి తెలిసిందే. అక్కడ మాత్రం ఎన్నికలు జరగ్గా, తెలంగాణలో మళ్లీ వాయిదా వేయడం చర్చనీయాంశమైంది.
నిజామాబాద్ స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన భూపతిరెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం, దీనిపై టీఆర్ఎస్ ఫిర్యాదు మేరకు నాటి చైర్మన్ స్వామిగౌడ్ భూపతిరెడ్డిపై అనర్హత వేటు వేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఈసారి టీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ నుంచి సుభాష్ రెడ్డి, బీజేపీ నుంచి లక్ష్మీనారాయణ బరిలో ఉన్నారు. కాగా, బైఎలక్షన్ లో అధికార టీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడుతోందంటూ కాంగ్రెస్, బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదులు చేశారు.