నిజామాబాద్ రైతులకు కేంద్రం కానుక.. కానీ రాష్ట్ర ప్రభుత్వం విఫలం : అర్వింద్
నిజామాబాద్ : జిల్లా రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందన్నారు ఎంపీ ధర్మపురి అర్వింద్. లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవితను ఓడించి బీజేపీకి పట్టం కట్టబెడితే రుణం తీర్చుకుందని చెప్పుకొచ్చారు. అందుకే రాష్ట్రానికి అవసరమైన దాని కంటే ఎక్కువగా యూరియా కోటా విడుదల చేసిందన్నారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన అర్వింద్ పలు అంశాలను ప్రస్తావించారు.
యూరియా కొరతపై మాట్లాడిన అర్వింద్.. టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. తెలంగాణలో యూరియా కొరత ఏర్పడితే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదని ధ్వజమెత్తారు. సరైన ప్రణాళిక లేక పోవడంతోనే రాష్ట్రంలో తీవ్రమైన యూరియా కొరత ఏర్పడిందని ఫైరయ్యారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన యూరియా కోటాను వినియోగించడంలో.. రైతులకు పంపిణీ చేయడంలో పూర్తిగా విఫలమైందని విరుచుకుపడ్డారు.
క్యాడర్ ఉంది సరే, మరి లీడర్లు.. ఆ కోటలో కమలం పువ్వు వికసించేనా..!
లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టడంతో రైతులకు యూరియా రూపంలో కేంద్ర ప్రభుత్వం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందన్నారు అర్వింద్. అయితే జిల్లాకు కేటాయించిన యూరియాను ఇక్కడి రైతులకు ఇవ్వకుండా రాజకీయ కుట్రలకు తెర లేపారని ఆరోపించారు. ఆ క్రమంలో నిజామాబాద్ జిల్లాకు కేంద్రం నుంచి వచ్చిన యూరియాను పొరుగు జిల్లాలకు పంపించారని మండిపడ్డారు.
నిజామాబాద్లో సీఎం కేసీఆర్ కూతురు కవితను ఓడించడం ద్వారా ఇక్కడి ప్రజలపై కక్ష కట్టినట్లు కనిపిస్తోందని ఆరోపించారు. జిల్లాకు కేటాయించిన యూరియాను ఇతర జిల్లాలకు పంపడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఈ విషయాన్ని అంత ఈజీగా వదిలిపెట్టబోమని.. రైతులతో కలిసి ఉద్యమం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేసీఆర్ కొడుకు కేటీఆర్కు కూడా రైతుల పట్ల చిత్తశుద్ది లేదన్నారు.