మరోసారి ఓరుగల్లు వస్తా, ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: నిజామాబాద్ ఎంపీ అర్వింద్
వరంగల్లో చేసిన కామెంట్లకు కట్టుబడి ఉన్నానని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. కేసీఆర్, ఇతర నేతలపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, త్వరలోనే వరంగల్ వస్తానని చెప్పారు. ఓరుగల్లులో టీఆర్ఎస్ నేతల కబ్జాలను బయటపెడతానని చెప్పారు. హిందూమత విశ్వాసాలకు వ్యతిరేకంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఇటీవల అర్వింద్ చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేసిన సంగతి తెలిసిందే.
వరంగల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు సమాధానం ఇస్తారని అర్వింద్ చెప్పారు. తాను ఎంపీనని.. దేశంలో ఎక్కడైనా తిరగొచ్చని చెప్పారు. త్వరలో మరోసారి వరంగల్ వస్తానని తెలిపారు. రాష్ట్రంలో కరోనా గురించి మంత్రి కేటీఆర్ అబద్దాలు ఆడుతున్నారని విమర్శించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్కు అర్వింద్ లేఖ రాశారు. దుబాయ్ నుంచి వస్తోన్న 422 మందికి క్వారంటైన్ వసతి కల్పించాలని కోరారు. వారు ఈ నెల 15 లేదంటే 16వ తేదీన వచ్చే అవకాశం ఉందన్నారు. వారికి క్వారంటైన్ వసతులు ఏర్పాటు చేయాలని కోరారు.