కేంద్ర మంత్రుల పర్యటన గందరగోళం.. టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల లొల్లి..!
నిజామాబాద్ : జిల్లాలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య యుద్ద వాతావరణం కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఓడిపోయి బీజేపీ నుంచి ధర్మపురి అర్వింద్ గెలిచిన దరిమిలా ఆ రెండు పార్టీల నేతల మధ్య నువ్వెంతంటే నువ్వెంత అనే రేంజ్లో మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ఆ క్రమంలో తాజాగా కేంద్ర మంత్రుల పర్యటన ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.
నందిపేట్ మండలం లక్కంపల్లిలో ఫుడ్ పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు హర్ సిమ్రాత్ కౌర్తో పాటు రామేశ్వర్ తెలి హాజరయ్యారు. ఆ క్రమంలో అక్కడ టీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు పోటాపోటీ నినాదాలు చేసి టెన్షన్ వాతావరణం క్రియేట్ చేశారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రసంగిస్తున్న సమయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేయడంతో పాటు పసుపు బోర్డు వాగ్ధానం ఏమైందంటూ ప్రశ్నించారు.
ఆనాటి అసెంబ్లీ టైగర్.. విద్యాసాగర్ రావు రీ ఎంట్రీ..! కేసీఆర్కు చెక్ పెట్టడానికేనా?
అదలావుంటే ఆర్మూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో బీజేపీ కార్యకర్తలు కూడా అదే స్థాయిలో రెచ్చిపోయారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు అందుకున్నారు. రైతులకు యూరియా సరఫరా చేయడంలో విఫలమైందని మండిపడ్డారు. ఆ క్రమంలో ఆ రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది.
ఇరు పార్టీల కార్యకర్తలు ఆగకుండా నినాదాలు చేస్తూనే ఉండటంతో సభలో గందరగోళం ఏర్పడింది. ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రులు ఇదంతా చూసి షాక్కు గురైనట్లు తెలుస్తోంది. అయితే పరిస్థితిని గమనించిన మంత్రి హర్ సిమ్రాత్ కౌర్ ఇరు వర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని.. అదే క్రమంలో నిజామాబాద్ మెగా ఫుడ్ పార్క్కు ఎక్కువ నిధులు కేటాయించినట్లు తెలిపారు. తెలంగాణ రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం 250 కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. రాష్ట్రానికి సరిపడా యూరియా కూడా కేంద్రం సరఫరా చేస్తోందని స్పష్టం చేశారు. మొత్తానికి రెండు పార్టీల కార్యకర్తలు శాంతించడంతో నేతలు ఊపిరి పీల్చుకున్నారు.