పుంజుకోవాల్నా, గింజుకుంటోంది..! కంచుకోటలో కాంగ్రెస్ కష్టాలు
నిజామాబాద్ : ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ.. అధికార టీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టింది. గులాబీదళంపై కన్నెర్రజేసిన హస్తం గూటి నేతలు గట్టిపోటీ ఇచ్చినట్లు కనిపించింది. తీరా ఫలితాలు చూసేసరికి బొక్కాబొర్లా పడింది. 119 స్థానాల్లో వందను దాటి పై 19 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోనైనా ప్రజాక్షేత్రంలో బలపడాల్సిన కాంగ్రెస్.. ఆ మేరకు ప్రయత్నాలు చేస్తున్న దాఖలాలైతే కనిపించడం లేదు. ఇక నిజామాబాద్ జిల్లాలోనైతే పార్టీ పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది.
అభ్యర్థులేరీ?
ముందస్తు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి మింగుడుపడని అంశం. టీఆర్ఎస్ ప్రభంజనం తట్టుకోలేకపోయిన కాంగ్రెస్.. కేవలం 19 స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది. అసెంబ్లీ ఫలితాలతో తీవ్ర నిరాశకు గురైన హస్తం గూటి నేతలు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్లు కనపడటం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత పుంజుకోవాల్సింది పోయి మరింత గింజుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇక నిజామాబాద్ జిల్లాలో ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. లోక్సభ ఎన్నికలు దగ్గరపడుతున్న దరిమిలా.. చేయి గుర్తుపై పోటీచేసేందుకు ఎవరూ ముందుకురాకపోతుండటం గమనార్హం.
కంచుకోటలో కష్టకాలం
ఒకనాడు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలా ఉండేది. ప్రస్తుతం కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతోంది. అసెంబ్లీ సమరంలో ఘోర పరాజయం పాలవడంతో.. లోక్సభ ఎలక్షన్ ఆ పార్టీకి పెద్ద సవాల్గా మారింది. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి అభ్యర్థులు కరువైన పరిస్థితి నెలకొనడంతో పార్టీ పెద్దలు డైలమాలో పడ్డారు. సీనియర్లు చాలామందే ఉన్నా.. పోటీకి సుముఖత వ్యక్తం చేయని పరిస్థితి. దీంతో ఏం చేయాలో తెలియక హైకమాండ్ కు తలనొప్పి వ్యవహారంగా మారింది.
పార్టీ పైసలిస్తే ఇద్దరికి ఓకేనట..!
నిజామాబాద్ పార్లమెంటరీ స్థానం నుంచి పోటీచేసేందుకు కాంగ్రెస్ నేతలు ముందుకు రాకపోవడంతో అధిష్టానానికి సవాల్ గా మారింది. పార్టీ పెద్దలకు నలుగురి పేర్లతో కూడిన జాబితా జిల్లా కాంగ్రెస్ కమిటీ అందించింది. మధుయాష్కి, సుదర్శన్ రెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్, తాహెర్ బిన్ హందాన్ పేర్లను హైకమాండుకు సూచించింది. అయితే ఎంపీ ఎన్నికలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి.. పోటీ చేసేందుకు ఎవరూ ముందుకురావడం లేదని తెలుస్తోంది.
టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా కల్వకుంట్ల కవిత ఉండటంతో ఆమెపై నెగ్గడం అంతా సులువుకాదనేది వారి భయంగా కనిపిస్తోంది. పోటీచేసి డబ్బులు పోగొట్టుకోవడం తప్ప గెలుపు అవకాశాలు లేవనేది వారి అంతరంగమేమో. అదలావుంటే పార్టీ ఆర్థికంగా అండదండలు అందిస్తే.. పోటీచేయడానికి ఒకరిద్దరు సుముఖంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.
మధుయాష్కి చూపు అటువైపు..! శ్రేణుల్లో అసంతృప్తి
నిజామాబాద్ నుంచి రెండుసార్లు కాంగ్రెస్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన మధుయాష్కి వ్యవహరశైలి జిల్లా కాంగ్రెస్ శ్రేణులకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఆయన నిజామాబాద్ ను వీడి భువనగిరి స్థానం నుంచి పార్టీ టికెట్ ఆశిస్తుండటం దానికి కారణం. పార్టీ బలంగా ఉన్న రోజుల్లో నిజామాబాద్ టికెట్ కోసం వీరలెవెల్లో కొట్లాడిన మధుయాష్కి.. ఇప్పుడు కష్టకాలంలో నిజామాబాద్ ను వీడి భువనగిరిపై కన్నేయడం ఎంతవరకు సబబు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మధుయాష్కి తీరుపై జిల్లాకు చెందిన సీనియర్ లీడర్ షబ్బీర్ అలీ అభ్యంతరం వ్యక్తంచేయడం మరింత ఆజ్యం పోసినట్లవుతోంది. మొత్తానికి నిజామాబాద్ పార్లమెంటరీ స్థానానికి అభ్యర్థుల కొరత ఏర్పడటం కాంగ్రెస్ పార్టీకి పెద్ద మైనస్ పాయింట్.