కారులో ఉండలేకున్నా.. 3 రోజుల్లో అన్నీ చెబుతా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే షాకింగ్
హైదరాబాద్ : కారులో ఉండలేకపోతున్నా. సోమవారం నాడు అన్నీ విషయాలు చెబుతా. సీఎం కేసీఆర్ దయ వల్లే ఎమ్మెల్యేగా గెలిచాను. కానీ, టీఆర్ఎస్లో ఇమడలేకపోతున్నా. గులాబీ ఇంటి పెద్దను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు. అందుకే నచ్చట్లేదు. ఇదంతా బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ మనోగతం. హైదరాబాద్లో బీజేపీ ఎంపీ అర్వింద్ను కలిశాక తన మనసులోని మాటను బయటపెట్టారు.
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అసంతృప్తి జ్వాలలు ఇంకా చల్లారడం లేదు. ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు చాలామంది అలకబూనారు. ఆ క్రమంలో బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ కూడా అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఆ క్రమంలో గురువారం (12.09.2019) నాడు నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్ను ఆయన కలవడం హాట్ టాపికైంది.
1994లో 450.. ఇప్పుడేమో లక్షలు.. బాలాపూర్ లడ్డు ప్రస్థానం ఇలా
టీఆర్ఎస్ పార్టీలో కష్టపడి పనిచేసేవారికి గుర్తింపు లేదని.. చెప్పుడు మాటలతో కొందరు సీఎం కేసీఆర్ను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు షకీల్. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో పరిస్థితి బాగా లేదని.. అందుకే అక్కడ ఇమడలేకపోతున్నానని వ్యాఖ్యానించారు. ఆ క్రమంలో రాజీనామాకు కూడా సిద్ధమేనంటూ ప్రకటించడం జిల్లా రాజకీయాల్లో సెన్సెషన్గా మారింది.
సీఎం కేసీఆర్ దయ వల్లే తాను ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పుకొచ్చిన షకీల్.. ఆయనను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. మంత్రి పదవి దక్కకపోవడంతో తనకు గుర్తింపు లేకుండా పోతోందని భావించిన నేపథ్యంలో షకీల్ బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో ఆయన అర్వింద్ను కలవడం.. సోమవారం (16.09.2019) నాడు అన్నీ విషయాలు బయట పెడతానని చెప్పడం సంచలనంగా మారింది.