గుడి కోసం గ్రామస్తులు వాటర్ ట్యాంక్ ఎక్కారు.. అధికారులు దిగొచ్చారు
కామారెడ్డి : భిక్కనూరు మండలంలోని పెద్దమల్లారెడ్డి చౌరస్తాలోని హనుమాన్ టెంపుల్ వివాదం రోజురోజుకీ ముదురుతోంది. ఈ గుడి మాదంటే మాదంటూ రెండు గ్రామాల ప్రజలు వాదిస్తున్నారు. ఆ క్రమంలో సిద్దరామేశ్వర్ నగర్కు చెందిన కొందరు వినూత్న నిరసనకు దిగారు. బస్వాపూర్కు చెందిన కొందరు హనుమాన్ ఆలయంపై పెత్తనం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ గుడి తమ గ్రామానికే చెందుతుందని అధికారులు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు.
కొందరు యువకులు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. హనుమాన్ ఆలయం సిద్దరామేశ్వర్ నగర్కే చెందుతుందని తహసీల్దార్, ఎంపీడీవోలు ప్రకటించాలని.. ఆ మేరకు లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకుని గ్రామానికి చేరుకున్న తహసీల్దార్ వెంకన్న, ఎంపీడీవో అనంతరావుకు చేదు అనుభవం ఎదురైంది. వారిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సర్కార్ స్కూళ్లకు పెరుగుతున్న క్యూ.. గవర్నమెంట్ బడికి జడ్జి కూతుళ్లు
వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపిన యువకులను కిందకు దించే విధంగా అధికారులు ప్రయత్నించారు. దాదాపు నాలుగు గంటల పాటు నిరసన పర్వం కొనసాగింది. హనుమాన్ ఆలయానికి సంబంధించిన భూమితో పాటు దేవాలయ ప్రాంగణం.. సిద్దరామేశ్వర్ నగర్కు చెందుతుందని లిఖితపూర్వకంగా రాసిచ్చేంతవరకు ఆందోళన విరమించబోమని పట్టుపట్టారు. చివరకు తహసీల్దార్, ఎంపీడీవో ఉన్నతాధికారులతో మాట్లాడి గుడి సిద్దరామేశ్వర్ నగర్కు చెందే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. దాంతో గ్రామస్తులు శాంతించారు. ఆ మేరకు వాటర్ ట్యాంక్ ఎక్కిన వ్యక్తులు కిందకు దిగి నిరసన విరమించారు.
సిద్దరామేశ్వర్ నగర్కు చెందిన పుట్టకొక్కుల వెంకటేశం, బోయిని లక్ష్మవ్వ 16 గుంటల భూమిని హనుమాన్ టెంపుల్కు విరాళంగా ఇచ్చారని చెబుతున్నారు గ్రామస్తులు. అయితే బస్వాపూర్కు చెందిన కొందరు వ్యక్తులు ఇటీవల భూరికార్డులను తారుమారు చేయించినట్లు ఆరోపిస్తున్నారు.