ఎంపీ అరవింద్కు సవాల్ విసిరిన ఎమ్మెల్యే గణేష్: అదే జరిగితే ముక్కును నేలకు రాస్తా
నిజామాబాద్ : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు కాకరేపుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యర్థి పార్టీలు పాగా వేసేందుకు ఛాన్స్ ఇవ్వకూడదని టీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలోనే మాటల వేడిని కూడా పెంచేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా గులాబీ దళం ప్రచారంను హోరెత్తిస్తోంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రం మొత్తం నిజామాబాద్ వైపే చూస్తోంది. నిజామాబాద్లో బీజేపీ ఎంపీ అరవింద్ స్థానిక సంస్థల ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ మాటల యుద్ధాన్ని మరింత పెంచారు. అంతే ధీటుగా టీఆర్ఎస్ కూడా కౌంటర్ ఇస్తోంది.
నిజామాబాదులో మేయర్ పదవిని మజ్లిస్కు కట్టబెట్టేందుకు టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తోందని ఎంపీ అరవింద్ ఆరోపణలు చేశారు. దీనిపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు నిజామాబాద్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. నిజామాబాద్లో టీఆర్ఎస్ గెలుపు తథ్యమని జోస్యం చెప్పిన బిగాల గణేష్... మజ్లిస్ పార్టీకి టీఆర్ఎస్ మేయర్ సీటు ఇస్తే ప్రెస్ క్లబ్ నుంచి కంఠేశ్వర్ ఆలయం వరకు తన ముక్కును నేలకు రాస్తానని సవాల్ విసిరారు. బీజేపీ ఎంపీ అరవింద్ అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నిజామాబాద్కు పసుపు బోర్డు తీసుకువస్తానని హామీ ఇచ్చిన అరవింద్ ముందు దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. అరవింద్లా బాండ్ పేపర్లు పై హామీలను రాసి ఆ తర్వాత మాట మార్చే స్వభావం గులాబీ పార్టీకి లేదని అన్నారు.
ఇక టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులను బీజేపీ మేనిఫెస్టోగా రాసుకున్నారని బిగాల గణేష్ ఎంపీ అరవింద్పై విమర్శలు గుప్పించారు. ఇక భైంసాలో ఘర్షణలు జరిగితే అరవింద్ నిజామాబాద్లో దీక్ష చేయడాన్ని తప్పుబట్టిన గణేష్... అరవింద్కు దమ్ముంటే భైంసాకు వెళ్లి దీక్ష చేయాలని సవాల్ విసిరారు. బీజేపీ కాంగ్రెస్లు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పిన బిగాల గణేష్... కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చేసిన అభివృద్ధికే ఓటు వేస్తారని చెప్పారు. టీఆర్ఎస్ చేసిన అభివృద్ధిపై అరవింద్ చర్చకు సిద్దమా అని మరో సవాల్ విసిరారు గణేష్.
ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం జరిగిన ఓ బహిరంగ సభలో కూడా ఎంపీ అరవింద్ మజ్లిస్ నేత అసదుద్దీన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసదుద్దీన్ ప్రొక్లెయినర్తో కిందకు వేలాడదీసి అతని గడ్డంను కత్తిరించి కేసీఆర్కు అంటిస్తామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఏఏ పై తప్పుడు ప్రచారం చేసి ప్రజల మధ్య వైషమ్యాలను పెంచుతున్నారని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీపై అరవింద్ మండిపడ్డారు.