కారు టైరుకు గులాబీ ముల్లు.. టీఆర్ఎస్కు మరో షాక్.. ఆ ఎమ్మెల్యే అటు వైపుగా..!
హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఏ ముహుర్తాన పెట్టారో గానీ అసంతృప్తుల సెగ పార్టీ పెద్దలకు నిద్ర లేకుండా చేస్తోంది. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో దశమి మంచి రోజని ఆదివారం నాడు మంత్రివర్గాన్ని విస్తరించారు సీఎం కేసీఆర్. ఆ ముహుర్తానికి ఆరుగురు మంత్రుల ప్రమాణ స్వీకారం బాగానే జరిగింది గానీ.. అసంతృప్త నేతలు మాత్రం పెద్ద సంఖ్యలో బయట పడుతున్నారు. జోగు రామన్న, నాయిని నర్సింహా రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, బాజిరెడ్డి, అరికెపూడి గాంధీ లాంటి నేతలు అలకబూనినట్లు ప్రచారం జరుగుతూనే ఉంది.
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ గులాబీ వనంలో చిచ్చు రేపుతోంది. మంత్రివర్గ విస్తరణ జరిగి నాలుగైదు రోజులు గడుస్తున్నా.. అసంతృప్త జ్వాలలు ఏమాత్రం తగ్గడం లేదు. అదే క్రమంలో కారు టైరుకు మరో గులాబీ ముల్లు గుచ్చుకోనుంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కారు దిగి కాషాయం జెండా కప్పుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారట.
తెలంగాణ తలసరి ఆదాయంలో రంగారెడ్డి టాప్.. జగిత్యాల లాస్ట్
బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ గురువారం (12.09.2019) నాడు నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ను కలవడం చర్చానీయాంశమైంది. హైదరాబాద్లో జరిగిన వీరిద్ధరి భేటీ జిల్లా రాజకీయాలను షేక్ చేస్తోంది. మంత్రి పదవి వస్తుందని ఆశించిన షకీల్.. చివరకు తన కల నెరవేరకపోవడంతో బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారానికి ఈ భేటీ సాక్ష్యంగా నిలుస్తోంది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని ఇటీవల బీజేపీ నేతలు చెబుతూనే ఉన్నారు. అదంతా ట్రాష్ అని కొట్టిపారేశారు గులాబీ పెద్దలు. అయితే తాజాగా షకీల్ అహ్మద్.. బీజేపీ ఎంపీ అర్వింద్ను కలవడం హాట్ టాపికైంది. అర్వింద్తో భేటీ అనంతరం షకీల్ స్పందించారు. పార్టీ మారితే మారొచ్చు అంటూ పరోక్ష సిగ్నల్ ఇచ్చేశారు. అదలావుంటే ఇంకెంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు బీజేపీ వైపు చూస్తున్నారనేది కొన్ని రోజులు ఆగితే తేలిపోతుందని అంటున్నారు కమలనాథులు.