కవితకు ఎన్నికల గండం ... కవితపై పోటీకి వెయ్యి మంది రైతాంగం .. కేసీఆర్ ఏం చేస్తారో ?
Recommended Video
గిట్టుబాటు ధర కోసం పసుపు, ఎర్రజొన్న రైతులు కన్నెర్ర చేశారు. ఆందోళనలు చేశారు. లాఠీ దెబ్బలు తిన్నారు. జైలుకు కూడా వెళ్ళారు. అయినా ఇప్పటి వరకు ఆర్మూరు రైతుల గోడు పట్టించుకున్న వారు లేరు. దీంతో ప్రభుత్వానికి సెగ తగిలేలా ఆర్మూరు రైతన్నలు లోక్ సభ ఎన్నికలను అడ్డుకోవాలని నిర్ణయించారు. దీంతో నిజామాబాద్ లోక్ సభ స్థానం నుండి ఎన్నికల్లో పోటీ చెయ్యటానికి నామినేషన్లు దాఖలు చెయ్యనున్నారు రైతులు. అందుకు కావాల్సిన ఆర్ధిక వనరులను సైతం రైతులు సమిష్టిగా సమకూర్చుకున్నారు. రైతులు తీసుకున్న ఈ షాకింగ్ నిర్ణయంతో నిజామాబాద్ ఎంపీ కవితకు కష్టాలు తప్పేలా లేవు.
కరీంనగర్ ప్రచార సభలో కేసీఆర్ సంచలనం .. అవసరమైతే కొత్త జాతీయపార్టీ పెడతా
కవితపై పోటీకి ప్రతిపక్ష పార్టీల భయం ... కవితపై పోటీకి రైతుల ధైర్యం
ఈసారి కూడా నిజామాబాద్ స్థానం నుండి పోటీకి దిగుతున్నారు కవిత. అయితే ఆమెకు పోటీగా నిలబడటానికి ప్రత్యర్ధి పార్టీల నుండి నాయకులు ఎవరూ ముందుకు రావటం లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ కోదండ రాం ను కవితకు పోటీగా నిలిపి మద్దతు ఇవ్వాలని భావిస్తోంది. కానీ కోదండ రాం కూడా కవిత పై పోటీకి బరిలోకి దిగటం అనుమానమే . కవిత తో పోటీ అంటే హేమాహేమీలే భయపడుతున్న తరుణంలో తమ సమస్య పరిష్కారం కోసం రైతన్నలు కవితపై పోటీ చెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వెయ్యి మంది రైతులు ఈ నిర్ణయం తీసుకుని గిట్టుబాటు ధర కోసం సమిష్టిగా అడుగులేస్తున్నారు. తమకు ప్రభుత్వం నుండి సహకారం అందకపోవడంతో ఆగ్రహించిన వీరంతా ఈ నిర్ణయం తీసుకున్నారు.
వెనక్కు తగ్గని రైతులు... ఎన్నికలు ఆపే వ్యూహం
గత నెలలో పసుపు, ఎర్రజొన్నకు మద్దతు ధర కల్పించాలని నిజామాబాద్, కరీంగర్, ఆర్మూర్ రైతులు తీవ్ర స్థాయిలో నిరసన తెలిపారు. అయినా ప్రభుత్వం దిగిరాలేదు. దీంతో ఈ బ్యాలెట్ పోరుకు తెరలేపారు రైతులు. ఆ తరవాత కవిత సమస్యను పరిశీలించి న్యాయం చేస్తామని మాటిచ్చినా రైతులు వెనక్కు తగ్గలేదు. రైతు సంఘాలన్నీ కలిసి నిజామాబాద్ స్థానం నుండి 1000 వరకు నామినేషన్లు దాఖలు చేయడానికి సిద్ధమయ్యారు. ఒక్కో గ్రామం నుండి ఐదుగురి చొప్పున పోటీలో ఉండనున్నారు రైతులు . మొత్తం వెయ్యి మంది ఎన్నికల పోరులోకి దిగనున్నారు. ఒక నియోజకవర్గంలో 30 మంది అభ్యర్థులు పోటీచేస్తేనే ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటారు. గుర్తులు కేటాయించలేక..ఈవీఎం బ్యాలెట్పై పేర్లు సరిపోక..ఇబ్బందులు పడుతుంటారు. అలాంటిది ఏకంగా వెయ్యి మంది పోటీచేస్తే...అసలు ఎన్నికలు జరుగుతాయా ... లేకా ఆగుతాయా అన్నది ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్న అంశం. రైతుల సమస్య గాలికొదిలేసిన కేసీఆర్ కు, కూతురు, ఎంపీ కవితకు పసుపు రైతులు షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.
2౦౦ గ్రామాల నుండి వెయ్యి మంది పోటీలో ..
200 గ్రామాల నుంచి సుమారు వెయ్యి మంది రైతులు ఎన్నికల్లో పోటీచేస్తారని జాయింట్ యాక్షన్ కమిటీ వెల్లడించింది. పసుపును పండించే ఊళ్లలో గ్రామాభివృద్ధి కమిటీల నుంచి రూ.5,000-10,000 సేకరించి సెక్యూరిటీ డిపాజిట్ చెల్లిస్తామని తెలిపారు. అలా చేయడం వల్ల రైతులపై ఆర్థిక భారం ఉండదని వివరించారు.ఈ పోరులో రైతులు ఎంపీ సీటుని గెలవలేకపోవచ్చు కానీ ఎన్నికలు జరగకుండా నామినేషన్ ల ద్వారా అడ్డుకునే అవకాశం వుంది.
2014 ఎన్నికల సమయంలో కూడా ఇదే తరహా వ్యూహాన్ని అమలు చేసిన రైతులు అప్పట్లో 27 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అందులో పది మంది నామినేషన్లు తిరస్కరణకు గురి కాగా 17 మంది రైతులు ఎన్నికల బరిలో నిలిచారు. అయితే అప్పుడు ఎన్నికల మీద అదంత ప్రభావం చూపించలేకపోయింది.
కేసీఆర్ రైతుల సమస్య పరిష్కరిస్తారా .. కూతురిని గట్టెక్కిస్తారా..
కానీ ఈ సారి ఎన్నికను అడ్డుకునే విధంగా వేల సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయాలని తీర్మానించారు. ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించే వరకు పోల్ పోరాటం సాగిస్తామని ఆర్మూరు రైతులు తేల్చి చెబుతున్నారు. తమ డిమాండ్ పరిష్కరించకుంటే ఎంతవరకైనా వెళ్లే ఆర్మూరు రైతుల ఆందోళన ప్రస్తుతం ప్రభుత్వాన్ని టెన్షన్ పెడుతోంది.మరోవైపు ఎన్నికల ప్రచారం కోసం నిజామాబాద్ రానున్న కేసీఆర్... కూతురు కవితకు రాజకీయంగా ఎలాంటి ఇబ్బందీ లేకుండా రైతుల డిమాండ్స్ పరిష్కరిస్తారా అన్నది ఆసక్తికర అంశంగా మారింది.