ఒకే కుటుంబంలో మూడు హత్యలు.. కామారెడ్డి జిల్లాలో కలకలం..!
నిజామాబాద్ : కామారెడ్డి జిల్లాలో కలకలం రేగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. దోమకొండ మండలంలో జరిగిన ఈ ఘటన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అలజడికి కారణమైంది. జంగంపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దోమకొండ గ్రామ శివారులో విగత జీవులై కనిపించడం భయాందోళన రేకెత్తించింది. బందెల బాలయ్య, అతని కూతురు లతతో పాటు ఆయన తమ్ముడి కూతురు చందనను అతి కిరాతకంగా చంపిన వైనం చర్చానీయాంశమైంది.
బాలయ్య మరో తమ్ముడు రవి శుక్రవారం నాడు సాయంత్రం ఆ ముగ్గురిని బయటకు తీసుకెళ్లాడు. ఆ క్రమంలో చీకటిపడ్డా కూడా వారు ఇంటికి చేరుకోలేదు. ఇంటి నుంచి బయటికెళ్లిన నలుగురు ఇంకా రాలేదని కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. చాలా చోట్ల వెతికినా వారి ఆచూకీ దొరకలేదు. ఇక లాభం లేదనుకుని పోలీసులను ఆశ్రయించారు. అయితే శనివారం ఉదయం దోమకొండ గ్రామ శివారులో ముగ్గురు వ్యక్తుల మృత దేహాలు ఉన్నాయనే సమాచారంతో పోలీసులు ఆ కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా విషయం వివరించారు. ఘటనాస్థలికి చేరుకున్న వారు ఆ ముగ్గురు తమ వాళ్లేనని గుర్తించారు. అదలావుంటే బాలయ్య, లత, చందన మృతదేహాలు కనిపించడం.. రవి జాడ లేకపోవడంతో అతడిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాలేజీ విద్యార్థులే టార్గెట్.. విజయవాడలో డ్రగ్స్ ముఠా అరెస్ట్
ఆ ముగ్గురు చనిపోయిన ప్రాంతంలో పురుగుల మందు డబ్బాతో పాటు ఓ కూల్ డ్రింక్ బాటిల్, ప్లాస్టిక్ గ్లాసులు, బ్లేడు కనిపించాయి. దాంతో పురుగుల మందులో కూల్ డ్రింక్ కలిపి వారితో తాగించిన తర్వాత బ్లేడ్తో కోసి హతమార్చినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ఇటీవల బాలయ్య కూతురు లత వారి కులానికే చెందిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అది కాస్తా ఆమె బాబాయి రవికి నచ్చలేదు. దాంతో ఆ కుటుంబంలో గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అదే క్రమంలో శుక్రవారం నాడు ఆ ముగ్గురిని బయటకు తీసుకెళ్లిన రవి ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉండొచ్చని భావిస్తున్నారు.
ఈ హత్యల తర్వాత రవి ఆచూకీ కనిపించకపోవడంతో అతడిపైనే ప్రధానంగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీస్ డాగ్ను తెప్పించగా అది కాస్తా చెరువు దగ్గరకు వెళ్లి ఆగిపోయింది. అక్కడే రవి బైక్ కనిపించింది. దాంతో ఈ ముగ్గురి హత్య తర్వాత రవి పారిపోయాడా లేదంటే చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానస్పద హత్యల కేసుగా నమోదు చేసుకున్నారు.