నిజామాబాద్ రైతుల పట్ల టీఆర్ఎస్, బీజేపి విరుద్ద ప్రకటనలు..! వాళ్లు అసలు రైతులే కాదట..!!
నిజామాబాద్/హైదరాబాద్ : నిజామాబాద్ పసుపు రైతుల పట్ల రాజకీయ నేతలు భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. మొన్న ఎన్నికల సందర్బంగా ఎంపి కవిత మాట్లాడుతూ పోటీ చేసిన రైతులు అసలు పసుపు రైతులు కానే కాదని, వారు బీజేపి, కాంగ్రెస్ ప్రేరేపిత అభ్యర్థులను చెప్పుకొచ్చారు. అవే మాటలను ఇప్పుడు బీజేపి ఎంపీ అభ్యర్థి తిరగేసి చెప్తున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి 170కి పైగా రైతులు స్వతంత్రులుగా బరిలోకి దిగారు. అయితే, అదే స్ఫూర్తితో తాజాగా ప్రధాని మోదీ పోటీచేస్తున్న వారణాసి నుంచి కూడా పసుపు రైతులు భారీ స్థాయిలో ఎన్నికల పోటీకి దిగనున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. అవన్నీ తప్పుడు వార్తలని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ స్పష్టం చేశారు.
వాళ్లు ముమ్మాటికి గులాబీ కార్యక్తలే..! మోదీపై రైతులు పోటీ చేయడం లేదంటున్న అరవింద్..!!
వారణాసిలో పోటీకి దిగుతున్న అభ్యర్థులెవరూ పసుపు రైతులు కాదని అన్నారు. అక్కడ పోటీకి దిగుతున్నవారు తాజా ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పనిచేసిన వారేనని వెల్లడించారు. నిజామాబాద్ తరహాలో వారణాసిలో కూడా రైతులు భారీ ఎత్తున పోటీకి దిగుతున్నారని విడుదలైన ప్రెస్ నోట్ తప్పు అని అన్నారు. వీరు మొన్నటి నిజామాబాద్ ఎన్నికల్లో కూడా పోటీచేసినవారు కాదని తెలిపారు.
కవిత, అరవింద్ పరస్పర ఆరోపణలు..! రైతులపై అబాండాలు..!!
రాజకీయ డ్రామాల కోసం ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు రైతులపై నిజమైన ప్రేమ ఉంటే బోనస్ ఎందుకు ఇప్పించలేదని నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవితను ప్రశ్నించారు. బీజేపీకి పట్టం కడితే పసుపు, ఎర్రజొన్న పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంతో పాటు.. పసుపు బోర్డు కూడా ఏర్పాటు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టామని అరవింద్ గుర్తు చేశారు.
రంగం సిద్ధం చేసుకున్నపసుపు రైతులు..! దేశవ్యాప్తంగా సమస్య చాటి చెప్పే ప్రయత్నం..!!
ఇదిలా ఉండగా ఇటీవల నిజామాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేసి సంచలనం సృష్టించిన నిజామాబాద్ రైతులు మరో సంచలనానికి తెరలేపిన విషయం తెలిసిందే. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీపైనే పోటీ చేయాలని నిర్ణయించారు. వారణాసి నుంచి పోటీ చేసి తమ సమస్యను దేశవ్యాప్తంగా మరింత చర్చ జరిగేలా చేయాలని భావిస్తున్నారు. నిజామాబాద్ నుంచి నామినేషన్లు వేయడాన్ని కాంగ్రెస్, బీజేపీలు రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నాయని, కేవలం టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవితను లక్ష్యంగా చేసుకొని ప్రచారం చేయడం వల్ల అసలు విషయం పక్క దారి పట్టిందన్న భావన ఆ రైతుల్లో నెలకొన్నట్టు చర్చ జరుగుతోంది.
చలో వారణాసి కార్యక్రమానికి శ్రీకారం..! వారు రైతులు కాదన్న బీజేపి..!!
తెలంగాణ పసుపు రైతుల సంఘం ఆధ్వర్యంలో ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల నుంచి 50 మంది పసుపు రైతులు చలో వారణాసి కార్యక్రమంలో భాగంగా అక్కడికి బయలుదేరినట్లు పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు తిరుపతిరెడ్డి తెలిపారు. ఐతే ఇదంతా అదికార గులాబీ పార్టీ ఆడిస్తున్న నాటకమని బీజేపి కొట్టిపారేస్తోంది. వారణాసిలో మోదీ మీద ఏఒక్క రైతు కూడా పోటీలో లేరని బీజేపి నిజామాబాద్ ఎంపి అభ్యర్థి అరవింద్ స్పష్టం చేస్తున్నారు.