అదే నిజమని నమ్మితే..! పంచాయతీ ఎన్నికలకు "వాట్సాప్" దెబ్బ
పంచాయతీ ఎన్నికల్లో వాట్సాప్ దెబ్బకొట్టింది. ఏకంగా ఓ గ్రామ పంచాయతీలో ఇద్దరు వార్డు మెంబర్లు లేకుండా చేసింది. నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి మండలంలో రంజిత్ నాయక్ తండాలో జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. ఇటీవల పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ల జాబితా వాట్సాప్ లో షికారు చేసింది. అయితే అవే రిజర్వేషన్లు కన్ఫామ్ అనుకుని చాలామంది నమ్మారు. ఎలక్షన్ కమిషన్ ప్రకటన రాకముందే ఆ జాబితా వాట్సాప్ లో తెగ తిరిగింది. దీంతో రంజిత్ నాయక్ తండా గ్రామస్థులు అదే నిజమనుకున్నారు. అనంతరం అధికారులు విడుదల చేసిన ఒరిజినల్ రిజర్వేషన్ల జాబితాను ఎవరూ పట్టించుకోలేదు. వాట్సాప్ లో వచ్చిందే వాస్తవమనుకుని.. అందులో సూచించిన రిజర్వేషన్ల మేరకు సర్పంచితో పాటు వార్డుమెంబర్లను ఏకగ్రీవం చేసుకున్నారు.
అంతా ఓకే అనుకుని పంచాయతీ ఎన్నికల తంతు లాంఛనమేనని భావించారు. తీరా నామినేషన్ల దాఖలుకు చివరిరోజైన శుక్రవారం అసలు విషయం బయటపడింది. ఆరు వార్డులకు గాను రెండు వార్డుల్లో బీసీ నేతలు వేసిన నామినేషన్లను తిరస్కరించారు అధికారులు. ఎందుకంటే అవి ఎస్టీ రిజర్వుడు స్థానాలు. దీంతో బీసీలు నామినేషన్లు వేయడానికి వీలులేదన్నారు. వాట్సాప్ లో వచ్చిన రిజర్వేషన్ల జాబితా చూపించి అధికారులతో వాదించినా లాభం లేకపోయింది. ఎందుకంటే అది నిజమైన లిస్ట్ కాదు కాబట్టి. దీంతో రెండు వార్డు స్థానాలకు ఎన్నికలు లేనట్లే. చూశారా..! వాట్సాప్ మేసేజ్ ఎంత పని చేసిందో..! సోషల్ మీడియా పుంజుకుంటున్న తరుణంలో ఏది నిజమో ఏది అబద్దమో తెలియని పరిస్థితి. వాట్సాప్ లో వచ్చిన రిజర్వేషన్లే నిజమని నమ్మారు గ్రామస్థులు. ఏకగ్రీవానికి ముందు అధికారులను కలిస్తే అసలు విషయం తెలిసేది. అయితే ఎన్నికల అధికారులు ప్రకటించిన రిజర్వేషన్ల జాబితాను పంచాయతీ కార్యాలయం దగ్గర అతికించకపోవడంతోనే ఇలాంటి పరిస్థితి వచ్చిందంటున్నారు స్థానికులు.