కేసీఆర్ ఫోన్ చేయగా.. హరీశ్ ఇంటికొచ్చారు.. కాంగ్రెస్ను వీడటంపై డీఎస్.. చాలారోజుల తర్వాత
సీనియర్ నేత డీ శ్రీనివాస్ చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. ఓ చానెల్ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ పార్టీ వీడి, టీఆర్ఎస్లో చేరిక గురించి మాట్లాడారు. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నా.. చాలారోజుల నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తోన్నారు. నిజామాబాద్ స్థానిక టీఆర్ఎస్ నేతలు డీఎస్ను సస్పెండ్ చేయాలని కూడా కోరారు. కానీ డీఎస్ వ్యవహారంలో గులాబీ దళపతి కూడా నిర్ణయం తీసుకోలేకపోయారు. దీంతో ఆయన గత కొద్దిరోజుల నుంచి సైలంట్గా ఉన్నారు. చాలా రోజుల తర్వాత మీడియాతో మాట్లాడి.. జరిగిన ఘటనలను వివరించారు.
జీవితంలో చేసిన పెద్ద తప్పు..
కాంగ్రెస్ పార్టీని వదలి బయటకు రావడం దురదృష్టకరమని డీఎస్ అన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడతానని తాను ఎప్పుడూ ఊహించలేదని చెప్పారు. పార్టీ తనకు అన్నీ గౌరవాలు ఇచ్చిందని.. కానీ చివరకు పార్టీ వీడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కొందరి వలన తాను కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యానని చెప్పారు. వారు చెప్పే మాటలను హైకమాండ్ విశ్వసించిందని తెలిపారు. పార్టీలో చిన్న, పెద్ద అనేదీ ఏమీ ఉండదని.. వ్యతిరేక భావం ఏర్పడితే అంతే సంగతులు అని పరోక్షంగా చెప్పారు. ఎంత పెద్దవాళ్లకయినా.. అవమానాలు తప్పవనే అర్థంతో మాట్లాడారు.
జరిగిపోయిన తప్పు..
కొన్నిసార్లు తప్పులు జరిగిపోతాయని డీఎస్ తెలిపారు. అలా తన విషయంలో కూడా జరిగిందని చెప్పారు. ఏదో ఆశించి తాను కాంగ్రెస్ పార్టీని మాత్రం వీడలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ ఫోన్ చేశారని ఆనాటి పరిస్థితిని తెలిపారు. తెలంగాణ కోసం పోరాటం చేశామని.. రాష్ట్రానికి తమ్ముడు ముఖ్యమంత్రిగా ఉన్నాడని తనతో చెప్పారని పేర్కొన్నారు. ఏ అవసరం ఉన్నా.. తన వద్దకు రావొచ్చని తెలిపారని పేర్కొన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలు తనపై ప్రభావం చూపాయని డీఎస్ అంగీకరించారు. టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు దోహదం చేశాయని వెల్లడించారు. తర్వాత తన వద్దకు హరీశ్ రావు వచ్చారని.. పార్టీలో చేరాలని కోరారని తెలిపారు. అలా తాను టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
రాజ్యసభ సభ్యుడిగా పంపించి..
టీఆర్ఎస్ పార్టీలో చేరిన డీఎస్కు పార్టీ తగిన ప్రాధాన్యం ఇచ్చింది. రాజ్యసభకు పంపించింది. కానీ డీఎస్ కుమారుడు అర్వింద్ మాత్రం బీజేపీలో ఉన్నారు. దీంతో డీఎస్-కేసీఆర్ మధ్య ఎక్కడో చెడిందని ఆరోపణలు వచ్చాయి. దీనికి తగినట్టు.. వారిద్దరూ దూరంగా ఉండటంతో అనుమానం నిజం అనిపించింది. ఒకానొక సమయంలో నిజామాబాద్ స్థానిక నేతలు డీఎస్పై ఫిర్యాదు చేశారు. కానీ హై కమాండ్ మాత్రం స్తబ్దుగా ఉండిపోయింది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్నా.. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. చాలా రోజుల తర్వాత మీడియాతో మాట్లాడారు. పార్టీ వీడటం గురించి మాట్లాడటం చర్చకు దారితీసింది.
పార్టీ మారతారనే ప్రచారం..
వాస్తవానికి డీఎస్ కూడా పార్టీ మారతారనే ప్రచారం జరిగింది. రకరకాల ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆయన మాత్రం దూరం దూరంగానే ఉన్నారు. టీఆర్ఎస్ సభ్యుడిగానే కొనసాగుతున్నారు. కానీ కేసీఆర్తో మాట్లాడటం, గులాబీ పెద్దలతో మంతనాలు మాత్రం లేవు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ వీడటం గురించి మాట్లాడటంతో... తిరిగి ఆ పార్టీలోకి వెళ్లాలని అనుకుంటున్నారా అనే అనుమానాలు వస్తున్నాయి.