తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా, అపోలోలో చికిత్స.. అసెంబ్లీ సెషన్ ముందు వైరస్..
తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతుండగా.. ఇటు ప్రజా ప్రతినిధులకు కూడా పాజిటివ్ వస్తోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు రాగా.. ఆ వరసలో కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే చేరారు. కరోనా పాజిటివ్ రావడంతో ఆయన ఆస్పత్రిలో చేరిపోయారు. రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికీ పలువురు వైరస్ బారినపడి.. కోలుకున్న సంగతి తెలిసిందే.
సురేందర్కు పాజిటివ్..
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాలా సురేందర్ కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్నాక సురేందర్కు కరోనా వచ్చినట్టు తెలిసింది. రామారెడ్డి మండలంలో కల్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. తర్వాత నలతగా ఉండటంతో పరీక్ష చేయించుకున్నారు. కరోనా పాజిటివ్ రావడంతో.. ఆస్పత్రిలో చేరారు. సురేంధర్తో సన్నిహితంగా మెలిగిన నేతలు, అధికారులు టెన్షన్ పడుతున్నారు. ఎందుకైనా మంచిది పరీక్ష చేయించుకుంటామని చెబుతున్నారు.
నలుగురికి పాజిటివ్.. ముగ్గురికీ క్యూర్
ఉమ్మడి నిజాబామాద్ జిల్లాలో ఇప్పటివరకు నలుగురు ఎమ్మెల్యేలు కరోనా వైరస్ బారిన పడ్డారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. అయితే వారు తర్వాత కోలుకున్నారు. తాజాగా సురేందర్కు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది.
అసెంబ్లీ సమావేశాల ముందు
వీరే గాక జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, హోంమంత్రి మహమూద్ అలీ కూడా కరోనా వైరస్ బారినపడి కోలుకున్నారు. వచ్చేనెలలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు కరోనా వైరస్ బారిన పడటం కాస్త ఆందోళన కలిగిస్తోంది. చాలా మంది కోలుకున్నా.. సురేందర్ రెడ్డి ప్రస్తుతం పాజిటివ్ తీసుకుంటున్నారు. మరికొద్దిరోజుల సమయం ఉన్నందున, మిగతా నేతలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.