ఒకప్పటి ఐపీఎల్ ఆటగాడు..రేపు రాష్ట్రాన్ని నడిపే నాయకుడు..ఎవరతను?
పట్నా: బిహార్లో మళ్లీ లాలూ కుటుంబమే రాజ్యమేలే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. మొత్తం 243 స్థానాలు ఉన్న బిహార్ అసెంబ్లీలో తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి అయిన మహాఘట్ బంధన్(ఎంజీబీ) మ్యాజిక్ ఫిగర్కు చేరువలో ఉందని కొన్ని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు, మూడింట రెండొంతుల మెజారిటీ దక్కించు కుంటుందని మరికొన్ని సంస్థలు తేల్చాయి.
దాంతో లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడైన తేజస్వి యాదవ్ బిహార్ సీఎం కావడం ఖాయమని.. 15 ఏళ్లుగా సీఎంగా ఉన్న నితీశ్ కుమార్ స్థానంలో యువకుడైన తేజస్వి అధికార పగ్గాలు చేపడతాడనే ప్రచారం జోరందుకుంది. అయితే రాజకీయాల్లోకి రాకముందు తేజస్వి యాదవ్ స్టేట్ లెవల్ క్రికెటర్. ఐపీఎల్లో ఢిల్లీ డేర్డెవిల్స్కు కూడా ప్రాతినిథ్యం వహించాడు. కానీ తుది జట్టులో అవకాశం దక్కించుకోలేకపోయాడు.
దేశ రాజధానిలోని ఆర్కే పురంలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతూ.. పదో తరగతి మధ్యలోనే చదువు ఆపేసిన తేజస్వి.. క్రికెటర్గా ప్రస్థానం మొదలుపెట్టాడు. మిడిలార్డర్ బ్యాట్స్మెన్ అయిన తేజస్వి కవర్ డ్రైవ్లను చక్కగా ఆడగలడు. విరాట్ కోహ్లీ ఆడుతున్న సమయంలోనే ఢిల్లీ అండర్-19 క్రికెట్ జట్టులో తేజస్వి ఆడాడు. అండర్-16 క్రికెట్లో తేజస్వి కెప్టెన్సీలో కోహ్లీ ఆడాడని మాజీ సెలక్టర్ వెంగ్ సర్కారు తెలిపినట్లు ప్రచారం జరుగుతుంది.
ఐపీఎల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్కు ఎంపికైన తేజస్వీ.. 2008 నుంచి నాలుగు సీజన్లపాటు అతడు బెంచ్కే పరిమితమయ్యాడు. ఐపీఎల్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయినా ఒకే ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు. ఇందులో మొదటి ఇన్నింగ్స్లో 1 పరుగుకే ఔటైన తేజస్వీ యాదవ్.. రెండో ఇన్నింగ్స్లో 19 రన్స్ చేశాడు. లిస్టు ఏ క్రికెట్లో 2 మ్యాచులు ఆడిన తేజశ్వి యాదవ్... కేవలం 14 పరుగులు మాత్రమే చేశాడు. నాలుగు టీ20ల్లో తేజస్వి యాదవ్... ఒకే ఒక్క మ్యాచ్లో బ్యాటింగ్కు వచ్చి 3 పరుగులు మాత్రమే చేశాడు.
ఎన్నో మ్యాచులు ఆడి, నిలకడైన ప్రదర్శన ఇస్తున్నవారికి కూడా దక్కని అవకాశం తేజశ్వి యాదవ్కు దక్కడంపై లాలు ప్రసాద్ హస్తం ఉంది. ఆయన కొడుకు కావడంతోనే జట్టులో నుంచి తీసేయడానికి ఢిల్లీ టీమ్ సాహిసించలేదు. ఇక టీమ్ ప్రాక్టీస్కు కూడా తేజస్వీ యాదవ్ ఆలస్యంగా వచ్చేవాడని ప్రచారం జరుగుతోంది.
2012లో ఐపీఎల్ ఫిక్సింగ్ స్కామ్ వెలుగు చూసినప్పుడు పార్లమెంటులో ఈ విషయం చర్చకి వచ్చినప్పుడు ... నా కొడుకు ఐపీఎల్ ఆడుతున్నాడు. కానీ ఆటగాళ్లకు వాటర్ బాటిళ్లు ఇవ్వడం తప్ప ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.'అని చెప్పాడు. 2012లో క్రికెట్కు గుడ్ బై చెప్పిన తేజస్వి.. రాజకీయాలపై దృష్టిసారించాడు. బిహార్ సీఎం పీఠం ఎక్కేందుకు సిద్దమయ్యాడు.