చివరి నిమిషంలో హితేష్ తప్పుకోవడం వెనుక.. అసలు కారణం!
ఒంగోలు: ప్రకాశం జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉన్న దగ్గుబాటి హితేష్ చివరి నిమిషంలో తప్పుకోవడం వెనుక అమెరికా పౌరసత్వం అడ్డు పడింది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి దంపతుల కుమారుడు హితేష్ కు అమెరికా పౌరసత్వం ఉంది. హితేష్ కే కాదు.. ఆయన సోదరి కూడా అమెరికా పౌరసత్వాన్ని తీసుకున్నారు.
కేసీఆర్! జగన్కు మద్దతుకాదు.. ఇలా చెయ్: మళ్లీ సర్వే చేస్తున్న లగడపాటి, తెలంగాణలో కూడా
విదేశీ పౌరసత్వం ఉన్నవారు భారత దేశంలో జరిగే ఏ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు ఉండదు. నిబంధనలు దీనికి అంగీకరించవు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే అమెరికా పౌరసత్వాన్ని రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది రద్దు కావాలంటే- అమెరికన్ కాన్సులేట్ కు లేఖ రాయడం దగ్గరి నుంచి పలు నియమాలను అనుసరించాల్సి ఉంటుంది. ఇది సుదీర్ఘ ప్రక్రియ. నిజానికి- రాజకీయాల్లోకి ప్రవేశించాలని నిర్ణయం తీసుకున్నప్పుడే..హితేష్ అమెరికా కాన్సులేట్ కు లేఖ రాశారు.
నిబంధనల ప్రకారం.. అన్ని చర్యలు తీసుకున్నారు. ఉత్తర, ప్రత్యుత్తరాలు నడిచాయి. పౌరసత్వం రద్దు కావడానికి మరికొంత సమయం పట్టొచ్చంటూ హైదరాబాద్ లోని అమెరికన్ కాన్సులేట్ జనరల్ వద్ద నుంచి తాజాగా సమాచారం అందింది. దీనితో హితేష్ వెనక్కి తగ్గక తప్పలేదు. హితేష్ కు బదులుగా ఆయన తండ్రి, సీనియర్ పొలిటీషియన్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైఎస్ఆర్ సీపీ తరఫున పర్చూరు అసెంబ్లీ బరిలో పోటీ చేయబోతున్నారు.