దారుణం : పేదలకు అన్నం పెడుతున్న కుటుంబంపై దాడి.. ఆమంచి వర్గంపై ఆరోపణలు
ప్రకాశం జిల్లా చీరాలలో దారుణం జరిగింది. లాక్ డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న పేదలకు అన్నదానం చేస్తున్న ఓ కుటుంబంపై దాడి జరిగింది. ఈ దాడిలో ప్రశాంత్ అనే యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. మాజీ ఎమ్మెల్యే,వైసీపీ నేత ఆమంచి వర్గీయులే ఈ దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం చేనేత పురి కాలనీలో కరణం వెంకటేష్ యూత్ ఆధ్వర్యంలో అనుభవం వెంకటేశ్వర్లు కుటుంబం కొద్దిరోజులుగా స్థానిక నిరుపేద కుటుంబాలకు అన్నదానం చేస్తోంది. ఇదే క్రమంలో ఆదివారం(మే 31) కూడా అన్నదాన కార్యక్రమం చేపడుతుండగా.. కొంతమంది అక్కడికి వచ్చి దౌర్జన్యానికి పాల్పడ్డారు.
ఇది ఆమంచి కృష్ణ మోహన్ కాలనీ అని.. ఇక్కడ ఏమి చేయాలన్నా తామే చేయాలని అన్నారు. దీంతో అనుభవం వెంకటేశ్వర్లు కుటుంబం వారితో విభేదించగా.. ఆ కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. శ్రీను అలియాస్ శివ, అతడి తమ్ముడు పృథ్వీతో పాటు మరో నలుగురు వ్యక్తులు అనుభవం వెంకటేశ్వర్లు కుటుంబంపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ దాడిలో వెంకటేశ్వర్లు కుమారుడు ప్రశాంత్ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అడ్డుకోబోయిన అతని తల్లిపై కూడా దాడి చేయగా.. ఆమె తలకు గాయమైనట్టు సమాచారం.
దాడి అనంతరం ఆ గ్యాంగ్ అక్కడినుంచి పారిపోయినట్టు తెలుస్తోంది. బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో దాడిపై ఫిర్యాదు చేశారు. ఆమంచి వర్గీయులే తమపై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో ఆరోపించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.