ప్రకాశం జిల్లాలో బస్సు బోల్తా ఘటన .. ఇద్దరు మృతి .. 26 మందికి గాయాలు
రోడ్లు రక్తమోడుతున్నాయి. రోజు రోజుకీ తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం నిండు ప్రాణాలను గాలిలో కలిపేస్తుంది.ఇక తెలుగు రాష్ట్రాల్లో బస్సు బోల్తా ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇక తాజాగా ప్రకాశం జిల్లా మార్కాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశైలం నుంచి కడప కి బయలుదేరిన ఆర్టీసీ బస్సు ముందు వెళుతున్న బైక్ను ఢీ కొట్టి బోల్తా కొట్టింది. ఈ బస్సు బోల్తా ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 26 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద ఘటన గల కారణాలను దర్యాప్తు చేపట్టారు.
ఇక ఈ ప్రమాద వివరాలను చూస్తే శ్రీశైలం నుంచి 26 మంది ప్రయాణికులతో కడపకు ఆర్టిసి బస్సు బయలుదేరింది.కడప నుండి శ్రీశైలం వెళ్తుండగా ఒక్కసారిగా బస్సు దరిమడుగు సమీపంలోని మహ్మద్సాహెబ్ కుంట వద్ద ముందు వెళ్తున్న బైక్ను బస్సు ఢీ కొట్టింది. డ్రైవర్ చాలా వేగంగా వాహనం నడుపుతుండడంతో వేగంగా వస్తున్న బస్సు, ఎదురుగా వస్తున్న ట్రక్కును తప్పించే క్రమంలో , బైక్ ను ఢీ కొట్టి ఆపై బోల్తా పడింది.ఈ ప్రమాదంలో ప్రయాణికులందరూ ప్రాణాలతో బయటపడగా, వారిలో ఆరుగురికి గాయాలయ్యాయి. బస్సు ఢీకొట్టడంతో బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అంత దూరం ఎగిరి పడ్డారు. అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం అదుపుతప్పి కుంటలోకి వెళ్లిన బస్సు బోల్తా కొట్టినట్లు తెలుస్తోంది.
ఇక బస్సు ప్రమాదంలో బైక్పై వెళ్తున్న షేక్ అబ్దుల్ రహమాన్ అలియాస్ టింకు (32), షేక్ జిందాషాహిద్(19) అక్కడికక్కడే మృతి చెందారని పోలీసులు తెలిపారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు అబ్దుల్ , రెహమాన్ ఇద్దరు కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం మార్కాపురం వాసులుగా పోలీసులు గుర్తించారు. బస్సు డ్రైవర్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. బస్సు డ్రైవర్ ఎస్జే బాషాను అదుపులోకి తీసుకున్నారు.
అంతకుముందు సెప్టెంబరులో, అనంతపూర్ జిల్లాలో ఎన్ హెచ్ 44 లో జరిగిన ప్రమాదంలో ఎపిఎస్ఆర్టిసి బస్సు డ్రైవర్ మరణించాడు. బస్సు సిమెంట్ ట్రక్కును ఢీ కొట్టటంతో ప్రమాదం జరిగింది బస్సు నంద్యాల నుండి బెంగళూరుకు వెళ్తున్న క్రమంలో డ్రైవర్ నిద్ర మత్తులో వెనుక నుండి ట్రక్కును ఢీ కొట్టారు. ఇక ఆ ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. జూలైలో ప్రకాశం జిల్లాలో జరిగిన మరో సంఘటనలో, ఎపిఎస్ఆర్టిసి బస్సు చెట్టును ఢీ కొట్టటంతో 35 మంది ప్రయాణికులు గాయపడ్డారు. అధిక పని ఒత్తిడి వల్ల డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయి చెట్టును ఢీ కొట్టినట్టు తెలుస్తుంది. ఇక అదే నెలలో, విశాఖపట్నం జిల్లాలో ఎపిఎస్ఆర్టిసి బస్సులో మరో ప్రమాదం సంభవించింది, ఇందులో డ్రైవర్తో సహా 8 మంది గాయపడ్డారు. హైవేపై బస్సు ఆగి ఉన్నలారీని ఢీ కొనటంతో ఈ ప్రమాదం జరిగింది.